సినిమా ఫక్కీలో జరిగిన ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. అమ్మాయి తల్లిదండ్రులు ఒకలా చెబుతుంటే, నవీన్ రెడ్డి మరొకలా చెబుతున్నాడు. ఏం జరిగినా ఇంట్లోవారిపై దాడి చేసి, వస్తువులను ధ్వంసం చేసి, కిడ్నాప్ నకు పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న నవీన్ రెడ్డిపై ఆదిభట్ల పోలీసులు హత్యాయత్నం, అపహరణ, దాడితో పాటు పలు కేసులు నమోదు చేసి అతన్ని, 20మంది అనుచరులను అదుపులోనికి తీసుకున్నారు. యువతి సేఫ్ గా దొరకడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళితే…హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో శుక్రవారం పక్కా ప్రణాళికతో యువతిని కిడ్నాప్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నవీన్ రెడ్డి మొదటి నుంచి దంత వైద్యురాలి వెంట పడుతున్నాడని, వేధిస్తున్నాడని, ఫేక్ ఐడీలతో ఇన్ స్టాగ్రామ్ క్రియేట్ చేసి ఇబ్బందులు పెడుతున్నాడని యువతి తల్లిదండ్రులు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
గతంలో ఇదే స్టేషన్ లో ఈ విషయమై అక్టోబరు 10న ఫిర్యాదు చేశామని వారు తెలిపారు. అయితే నవీన్ రెడ్డి ఫేక్ ఐడీ సృష్టించినట్టు ఆదిభట్ల సీఐ నరేందర్ పూర్తి ఆధారాలు సేకరించారు. నవీన్ రెడ్డి , అతని స్నేహితుడు రఘుమారెడ్డి, మరొక వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇదిలా జరుగుతుండగా దంత వైద్యురాలితో తనకు వివాహమైందని ఇన్ స్టా ద్వారా ప్రచారం చేసుకున్న నవీన్ రెడ్డి ఎల్బీనగర్ కోర్టులో తన వివాహ విషయమై పిటీషన్ వేశాడు. దీంతో యువతి తండ్రికి నోటీసులు వెళ్లాయి. ఈ పరిస్థితుల్లో యువతి తల్లిదండ్రులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో నవీన్ వేధింపులపై ఫిర్యాదు చేశారు. ఇది ఆదిభట్ల పీఎస్ కిందకు వస్తుందని వారంటే, సరేనని అక్కడకు వెళితే, వారు సరిగా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈలోపు నవీన్ రెడ్డి ఒక కొత్త కారు కొని దాంట్లో నామినీ కింద తన కుమార్తె పేరు పెట్టి, కోర్టులో కేసు వేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ కేసును మొదటి నుంచి గమనిస్తున్నానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. దంత వైద్యురాలి కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. నవీన్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితులకు అండగా ఉంటామని, సత్వర న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు.