హుస్సేన్ సాగర తీరం ఇండియన్ లీగ్ రేస్ పోటీలకు ముస్తాబైంది. 10 వ తేదీ రాత్రి10 గంటల నుంచి 11వ తేదీ రాత్రి 10గంటల వరకు జరిగే ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. దీంతో ఈ ప్రాంతమంతా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.2023, ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ సన్నద్ధతలో భాగంగా చివరి రేస్ జరుగుతోంది.
దేశవ్యాప్తంగా ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గోవా నగరాలకు చెందిన రేసింగ్ జట్లు పాల్గొంటున్నాయి. హైదరాబాద్ లోని 2.7 కిమీ ట్రాక్ చుట్టూ ప్రీకాస్ట్ డివైడర్లు, వాటిపై ఎత్తుగా జాలీతో చేసిన మెష్ ఏర్పాటు చేశారు.. ప్రజల సందర్శనార్థం 8 చోట్ల గ్యాలరీలను ఏర్పాటు చేశారు.
చెన్నైలో కూడా ఇటీవల రెండుసార్లు రేస్ పోటీలు జరిగాయి. చివరగా హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్ వేదికగా ఫైనల్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. ఫార్ములా రేసింగ్ లో పాల్గొనే కార్లు మూడు రోజుల క్రితమే నగరానికి చేరుకున్నాయి.వీటిని ప్రత్యేకంగా తయారుచేసిన కంటైనర్లలో తరలించారు.ఐమ్యాక్స్ దగ్గర చేసిన ప్రాంతానికి తీసుకువచ్చారు.
ఇటాలియన్ స్పోర్ట్స్ ‘ప్రోటో టైప్స్’ ఛాంపియన్ షిప్ లో వినియోగించిన కార్లను ఇక్కడ వినియోగిస్తున్నారు. హైదరాబాద్ లో జరిగే రేసింగ్స్ కోసం ‘వోల్ఫ్ జీబీ08’ థండర్ మోడల్ కార్లను ఉపయోగిస్తున్నారు. ఒక సరికొత్త అనుభూతిని అందించే ఫార్ములా ఈ-కార్ రేసింగ్ చూసేందుకు అభిమానులు భారీగా తరలివస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.