బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ ర్యాలీ కారణంగా ముగ్గురు విద్యార్థులు నీట్ రీ ఎగ్గామ్ రాయలేకపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగర రహదారులు తీవ్రంగా ట్రాఫిక్ జామ్కు గురయ్యాయని, దీంతో నీట్ (NEET) రీ-టెస్ట్కు హాజరయ్యే విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని తెలుస్తోంది. ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో కనీసం ముగ్గురు విద్యార్థులు పరీక్షను రాయలేకపోయారు. ఈ ఘటన ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. విద్యార్థుల తల్లిదండ్రుల ఆరోపణల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థులు నిన్న నీట్ యూజీ రీ-టెస్ట్కు హాజరయ్యారు. ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణల కారణంగా నెల రోజుల క్రితం నిర్వహించిన తొలి పరీక్షను రద్దు చేసిన నేపథ్యంలో ఈ రీ-టెస్ట్ నిర్వహించారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. అయితే విద్యార్థులు కనీసం అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. కానీ సమయం దగ్గరపడే కొద్దీ బెంగళూరు రహదారులపై తీవ్ర గందరగోళం నెలకొంది.
తల్లిదండ్రులు తమ పిల్లలను సమయానికి పరీక్షా కేంద్రాలకు చేర్చేందుకు ద్విచక్ర వాహనాలతో కార్ల మధ్య దారులు వెతుక్కుంటూ వెళ్లారు. కొందరు అయితే ఫుట్పాత్లపై స్కూటర్లు నడిపి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఆలస్యంగా చేరుకున్న ముగ్గురు విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వారు పరీక్షా కేంద్రానికి చేరుకునేలోపే గేట్లు మూసివేశారు. లోపల గేట్లు కూడా మూసివేయడంతో వారు పరీక్షరాయలేకపోయారు. పరీక్షా కేంద్రం ప్రధాన గేటును ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ అధికారులు వారిని అనుమతించలేదు. దీంతో అభ్యర్థులు కన్నీరుమున్నీరయ్యారు.


