చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు ఏపీ ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలని చూశారని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలను ఉంచి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం లక్ష్మీపురం లోని మసీదు ఆవరణలో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం బాబూ నగర్లోని చర్చిలో ప్రార్థనలు చేశారు.
టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు జెండాలు వేరైనా అజెండాలు ఒక్కటేనని… అది ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడం అని భువనేశ్వరి అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని దోచేశారని ఆరోపించారు. వైసీపీ నేతల దోపిడీకి అడ్డుపడిన టీడీపీ కార్యకర్తలను దారుణంగా చంపేశారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదన్నారు. రాష్ట్రంలో ప్రాంతాలు వేరైనా మనమంతా ఒక్కటేనని చెప్పారు. రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల ప్రజలు వైసీపీ పాలనలో నలిగిపోయా రని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ దుర్మార్గపు పాలనను రానున్న ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. ఓటు అనే ఆయుధంతో రాక్షస పాలనను గద్దె దించాలని భువనేశ్వరి అన్నారు.