ఏళ్లపాటు పార్టీ కోసం కష్టపడ్డా టికెట్ దక్కలేదన్న ఆగ్రహంతో పార్టీనైతే వీడారు కానీ.. ఇక్కడున్న జోష్ అక్కడ లేదు. ఎన్నికల వేళ ఆ హంగామా లేదు. ప్రచార హడావుడి అంతకన్నా లేదు. ఇంతకీ జంపింగ్ జపాంగ్ల జోష్ తగ్గడానికి కారణాలేంటి..? పార్టీ మారినా మనసు మారలేదా..? అసలు అంబేద్కర్ జిల్లాలో ఏం జరుగుతోంది.
జనసేన పార్టీకి బలమైన జిల్లా అంబేద్కర్ కోనసీమ. ఆ ప్రాంతంలో పార్టీకి మంచి క్యాడర్ ఉంది. గడిచిన ఐదేళ్ల పాటు జనసేన నేతలు, కార్యకర్తలు, వీరమహిళలు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. అధికార పార్టీ వైసీపీ వైఫల్యాలను ఎండ గట్టడంలో ముందున్నారు. ఎన్నో వ్యతిరేక ఉద్యమాలు చేశారు. అయితే, ఇంత కష్టపడ్డా జనసేన నుంచి టికెట్ దక్కలేదు. పొత్తుల కారణంగా ఎన్నో రోజులుగా కన్నకలలన్నీ కల్లలయ్యాయి. దీంతో హైకమాండ్పై అలకబూనిన నేతలు వైసీపీతో చేతులు కలిపారు. జనసేనకు గుడ్బై చెప్పి జగన్కు జై కొట్టారు. బస్సుయాత్రలో జగన్ ఎక్కడుంటే అక్కడికి వెళ్లి మరీ వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇలా వెళ్లిన వారిలో అమలాపురం ఇన్చార్జి శెట్టిబత్తుల రాజాబాబు, ముమ్మిడివరం ఇన్చార్జి పితాని బాలకృష్ణ, రాజోలు ఇన్చార్జీ బొంతు రాజేశ్వర రావు, గత ఎన్నికల్లో జనసేన నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన డిఎంఆర్ శేఖర్ ఉన్నారు. వీరంతా టికెట్ ఆశించి భంగపడటంతో వైసీపీ పంచన చేరారు. అయితే చేరికల సమయంలో విస్తృతంగా ప్రచారం చేస్తామని ప్రగల్భాలు పలికిన ఈ నేతలు.. ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్నా ప్రచారంలో వారి జాడే లేదు.
ముమ్మిడివరం ఇన్చార్జ్గా ఉండి వైసీపీ గూటికి చేరారు పితాని బాలకృష్ణ. అయితే.. పార్టీలో చేరింది మొదలు ఇప్పటి వరకూ ఎక్కడా ఆయన ప్రచారంలో పాల్గొన్నది లేదు. ముమ్మిడివరంలో కనిపించిది లేదు. అలాగే మరో నాయకుడు శెట్టి బత్తుల బాలరాజు తీరు కూడా అంతే. వైసీపీ అధినేత వద్ద బీరాలైతే పలికారు కానీ.. ప్రచారంలో ఎక్కడా ఆయన కనిపించి లేదు. ప్రచార రథం సిద్ధమైందని, జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయడమే మిగిలిందని చెప్పిన శెట్టి బత్తుల కేవలం మాటలకే పరిమితమ య్యారు. దీంతో ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు అధికార పార్టీ శ్రేణులు. ఇక రాజమహేంద్రవరంలో నివాసముండే ONGC రిటైర్డ్ ఉద్యోగి జనసేనలో ఉన్నప్పుడే అడపా దడపా అమలాపురం వచ్చే వారని, వైసీపీలో చేరిన తర్వాత ఆయన రాజమహేంద్రవరానికే పరిమితం అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. డీఎంఆర్ శేఖర్ నివాసముండే రాజమహేంద్రవరంలో అయినా ప్రచారంలో పాల్గొంటున్నారా అంటే అదీ లేదన్న విమర్శను మూటకట్టుకుంటున్నారు.
ఇక మరో నేత రాజోలు జనసేన ఇన్చార్జి బొంతు రాజేశ్వరరావు తీరు కూడా ఇలాగే ఉంది. రాజోలు వైసీపీ అభ్యర్ధి గొల్లపల్లి సూర్యారావు వెంట ఒకటి రెండు సార్లు మాత్రమే కనిపించిన బొంతు రాజేశ్వరరావు.. ఆ తర్వాత ఎక్కడా ప్రచారంలో పాల్గొనడం లేదని వైసీపీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నారు. వీరంతా టికెట్ దక్కలేదన్న అసంతృఫ్తితో, ఆగ్రహంతో వైసీపీలో చేరారు తప్పితే.. పార్టీ మీద ప్రేమతో కాదని.. అందుకే విజయం కోసం తపన లేదన్న విమర్శ వినిపిస్తోంది. మరోపక్క కొందరు అభ్యర్థులకు జనసేన నుంచి వచ్చిన వలస నేతలంటే గిట్టదని, అందుకే వారు ప్రచారానికి దూరంగా ఉంటున్నారన్న టాక్ నడుస్తోంది. వీరంతా పార్టీ కోసం కాకుండా, వైసీపీ అధికారంలోకి వస్తే పదవులు అనుభవించవచ్చన్న వ్యూహంతోనే జగన్తో జత కట్టారని విమర్శిస్తున్నాయి వైసీపీ వర్గాలు. మరి అధికార పార్టీ వర్గాలు చెబుతున్నట్టు వలస నేతలకు వైసీపీ అంటే అభిమానం లేదా..? కేవలం పదవుల కోసమే పార్టీ మారారా అన్నది తెలియాంటే మున్ముందు జరిగే రాజకీయ పరిణామాలే తేలుస్తాయి .


