స్వతంత్ర, వెబ్ డెస్క్: జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళ రెజ్లర్ల పై పోలీసుల దాడి, అక్రమ అరెస్టులపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శిి కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో జంతర్ మంతర్ వద్ద దేశానికి ఎన్నో పతాకాలు గెలిచి కీర్తి సంపాదించి పెట్టిన క్రీడాకారులపై రెజ్లర్ల శిక్షణ విభాగానికి చీఫ్ కోచ్ గా ఉన్న ఎం.పి. బ్రిజ్ భూషణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, గత 35 రోజులుగా రెజ్లర్లు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆగ్రహవేషాలు వ్యక్తం చేస్తున్నా ఇప్పటికీ ఎంపీని అరెస్టు చేయకపోవడం మహిళల పట్ల బిజెపికి ఉన్న వైఖరికి అద్దం పడుతుంది.
ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ… ఒకవైపు నూతన పార్లమెంటు ప్రారంభోత్సవం జరుపుకుంటూ.. ప్రజాస్వామ్య పద్ధతులలో ఆందోళన చేస్తున్న మహిళ రెజ్లర్లపై అరాచక పద్ధతులలో దాడి చేయడం అత్యంత అమానుషమన్నారు. ప్రశ్నించే వాళ్ళని నిర్బంధించబడుతుంటే, తప్పు చేసిన వారు రాజులాగా యదేచ్ఛగా బయట తిరుగుతున్నారన్నారు. బేటి బచావో బేటి పడావో అనే పేరుతో ఆడపిల్లలను చదివించు, రక్షించు అని చెబుతూనే మహిళలను భక్షిస్తున్నారని సాంబశివరావు తెలిపారు. మోడీ నైతిక బాధ్యత వహించి మహిళలకు క్షమాపణ చెప్పాలని,బ్రిజ్ భూషణ్ సింగ్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.