మద్యం కుంభకోణం కేసులో గత కొంతకాలంగా ఈడీ సమన్లను తిరస్కరిస్తూ వస్తోన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. మరోసారి విచారణకు డుమ్మా కొట్టారు. మార్చి 12 తర్వాతే తాను దర్యాప్తు సంస్థ ఎదుట హాజరవుతానన్నారు. ఈ కేసులో విచారణ నిమిత్తం మార్చి 4న రావాలని ఇటీవల కేజ్రీవాల్కు ఈడీ ఎనిమిదోసారి సమన్లు జారీ చేసింది. ఈసారీ గైర్హాజరైన సీఎం.. ఈడీకి తన సమాధానం పంపారు. దర్యాప్తు సంస్థ సమన్లు చట్ట విరుద్ధమని మరోసారి ఆరోపించారు. అయినప్పటికీ వారి ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఢిల్లీ మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్కు గతేడాది నవంబర్ 2న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తొలిసారి సమన్లు జారీ చేసింది. అనంతరం వరుసగా నోటీసులు పంపిస్తున్నప్పటికీ హాజరు కావడం లేదు. సమన్లకు సీఎం స్పందించకపోవడంతో ఈడీ కొద్దిరోజుల క్రితం కోర్టును ఆశ్రయించింది. ఈ ఫిర్యాదుపై ఇటీవల న్యాయస్థానం నోటీసులు జారీ చేయడంతో కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఆయన అభ్యర్థన మేరకు తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు వ్యక్తిగతంగా న్యాయస్థానం ఎదుట హాజరుకానున్నారు.