బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం చేపట్టిన రైల్ రోకో ఉద్యమం కేసులో తెలంగాణ రక్షణ సేన, టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవితకు రైల్వే కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో విచారణ నిమిత్తం రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు సికింద్రాబాద్లోని సెకండ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ రైల్వే కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. 2025 నవంబర్ 28న కామారెడ్డి జిల్లా కేంద్రంలో కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో భారీ రైల్ రోకో నిర్వహించారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేపట్టారు.
తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలి ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్లులకు వెంటనే కేంద్రం ఆమోదం తెలపాలని కవిత డిమాండ్ చేశారు. రైల్వే ట్రాక్పై ఆందోళనకు దిగిన కవితతో పాటు టీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఈ రైల్ రోకో కారణంగా సిర్నపల్లి – ఇందల్వాయి రైల్వే స్టేషన్ల మధ్య నిజామాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న దేవగిరి ఎక్స్ప్రెస్ను నిలిపివేశారు. అలాగే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఓ గూడ్స్ రైలును కూడా ఆపివేశారు.
ఈ ఘటనపై కామారెడ్డి రైల్వే ఏఎస్ఐ రవీంద్ర బాబు ఫిర్యాదు చేయగా… కల్వకుంట్ల కవితతో పాటు మరో 12 మంది టీఆర్ఎస్ నాయకులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 147 మరియు 174(A)కింద కేసులు నమోదు చేశారు. రైల్వే రవాణాకు అంతరాయం కలిగించడం, ట్రాక్లపై అక్రమంగా నిరసన చేపట్టడం వంటి ఆరోపణలతో ఈ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఈ కేసులో విచారణకు హాజరుకావాలని సికింద్రాబాద్ రైల్వే కోర్టు సమన్లు జారీ చేయడంతో రాజకీయంగా ఈ వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక మరోవైపు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని అప్పట్లో కవిత స్పష్టం చేశారు.


