ప్రజాప్రతినిధి.. అంటే ప్రజల తరఫున చట్టసభల్లో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపించే నాయకుడు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అలాంటి ప్రజా ప్రతినిధులు 175 మంది ఉన్నారు. మరి వారిలో ఎంత మంది నిజంగా ప్రజల పక్షాన నిలబడ్డారు. ఎంత మంది తమకు ఓటు వేసి గెలిపించిన వారి కష్టాలను తీర్చారు. ఎంత మంది తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేశారు. అసలు ప్రజా ప్రతినిధుల పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు…? ఆ వివరాల్లోకి వెళదాం.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గం ఏలూరు. రాజకీయంగా ఎంతో చైతన్యం కలిగిన ఈ నియోజకవర్గంలో ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు.. మరోసారి గెలవడం అసాధ్య మన్నపేరు ఉండేది. అలాంటి మాటను చెరిపివేసిన ఘనత ఎమ్మెల్యే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్దేనని చెప్పాలి. వై.ఎస్ రాజశేఖర్రెడ్డి హవా కొనసాగిన సమయంలో 2004, 2009లో వరుసగా రెండుసార్లు ఏలూ రు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2014లో ఓటమిపాలైనా, 2019 ఎన్నికల్లో మాత్రం మరో సారి విజయం సాధించారు ఆళ్ల నాని. టీడీపీ అభ్యర్థి బడేటి కోట రామారావుపై విజయం సాధించారు. అంతేనా, సీఎం జగన్ తొలి కేబినెట్లో చోటు దక్కించుకోవడమే కాదు.. ఏకంగా ఉపముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు ఎమ్మెల్యే ఆళ్ల నాని.
డిప్యూటీ సీఎంగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆళ్ల నాని రెండున్నరేళ్ల పాటు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. పైగా కరోనా కష్టకాలంలో ఆరోగ్య శాఖ మంత్రిగా రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించి ప్రభుత్వం తరఫున పలు కార్యక్రమాలు చేపట్టారు. అయితే.. ఈ క్రమంలోనే ఆయన సొంత నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి వర్గంలోచోటు కోల్పోయారు ఆళ్ల నాని. అయితే.. ఆ తర్వాత ఆయన వ్యవహార శైలి పూర్తిగా మారిపోయిందన్న వాదన బలంగా విన్పిస్తోంది. ఆళ్ల నాని హయాంలో ఏలూరు నియోజకవర్గంలో ఎలాంటి మార్పులు జరిగాయి ? నగరంలో రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నా.. ఎమ్మెల్యే పట్టించుకోలేదన్న విమర్శల్లో వాస్తవమెంత ? అసలు తనకు నచ్చిన వాళ్లకే పదవులు కట్టబె డుతూ ఒక నియంతలా నాని వ్యవహరిస్తున్నారన్న విమర్శల్లో వాస్తవమెంత ?ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆళ్ల నాని.. ఆ స్థాయిలో ఏలూరును అభివృద్ధి చేశారా అంటే లేదన్నఅభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తప్పించి నియోజకవర్గంలో గతంలో పరిస్థితి ఎలా ఉందో.. ఇప్పుడూ అలానే ఉందన్న విమర్శలున్నా యి. ప్రధానంగా ప్రజలకు ఎమ్మెల్యే అందుబాటులో ఉండరన్న పేరుంది.అంతేకాదు.. ఇంటి వద్దే అధి కారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించే ఎమ్మెల్యే నాని.. అవి క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరుతున్నాయా లేదా అన్నది పట్టించుకోరన్న పేరుంది.
వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రోడ్ల సమస్య ప్రధానంగా ఏలూరులో కన్పిస్తోంది. రోజురోజుకూ రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా మారుతున్నా ఐదేళ్లపాటు ఎమ్మెల్యే పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. పైగా వ్యక్తిగత పనుల కోసం నానిని కలిసేందుకు సామాన్య ప్రజలు ఎవరైనా క్యాంపు కార్యాలయానికి వెళ్లినా ఒకటికి పదిసార్లు తిరిగినా పనులు జరగవన్న మాట గట్టిగా విన్పిస్తోంది. అంతే కాదు.. తన చుట్టూ ఓ కోటరీని ఏర్పాటు చేసుకొని పరిపాలన సాగిస్తూ.. తనకు నచ్చిన వాళ్లకే పదవు లు కట్టబెడుతున్నారన్న ఆరోపణలు ఎమ్మెల్యే ఆళ్ల నానిపై బలంగా విన్పిస్తున్నాయి.
ఎమ్మెల్యే ఇలా వ్యవహరించడానికి కారణం నియోజకవర్గంలో తనకు ఎదురులేకపోవడమేనన్న కామెంట్లు విన్పిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి బడ్జేటి బుజ్జి ఆ తర్వాత 2019 ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత మూడు నెలలోపే ఆయన మరణించారు. దీంతో.. వైసీపీకి, ప్రధానంగా ఆళ్ల నానికి తిరుగులేకుండా పోయింది. ఈ క్రమంలోనే వచ్చిన స్థానిక సంస్థలు, కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఏకపక్షంగా గెలుపొందారు. దీంతో నాని హవా మరింత పెరిగింది. నానికి పోటీగా బడేజి బుజ్జి సోదరుడు బడేటి రాధాకృష్ణను బరిలో దింపినా.. పెద్ద ప్రయోజనం లేదన్న వాదన విన్పిస్తోంది. మరో ముఖ్యమైన అంశం మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నా అవినీతి మరక అంటకుండా జాగ్రత్త పడ్డారు ఆళ్ల నాని. అలాగే.. శాంతి భద్రతల విషయంలోనూ ఎలాంటి పక్షపాతం లేకుండా, తనమన బేధం చూడకుండా వ్యవహరించడం ఆయనకు ప్లస్ పాయింట్గా మారింది. దీనికి తోడు ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏలూరులో వచ్చేలా చూసి ప్రజల్లో మంచి పేరు సంపాదించారు ఆళ్ల నాని. ఇక, జగన్ సంక్షేమపథకాలు అన్ని వర్గాల వారికి అందేలా చూడడంలో నాని సక్సెస్ అయ్యారన్న టాక్ నియోజకవర్గంలో ఉంది. స్వతహాగా సౌమ్యుడు, మితభాషి కావడం ఆయనకు ప్లస్ పాయింటనే చెప్పాలి. దీంతో..ఇప్పటికే మూడుసార్లు అధికారం కట్టబెట్టారు ఓటర్లు. మరి.. నాలుగోసారి పరిస్థితి ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తి రేపుతోంది. చూశారు కదా.. ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరుపై ప్రజల స్పందన.ఓవరాల్గా చెప్పాలంటే ఇక్కడి ప్రజలు ఆళ్ల నానికి 50-50 మార్కులు వేశారు. దీంతో.. ఆయన హిట్టూకాదు.. ఫట్టు కాదు..మధ్యస్తంగా ఉండిపోయారు.