హైదరాబాద్లోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. టిప్పర్ లారీ ఢీకొట్టడంతో నవవివాహిత ఫాతిమా బేగం(25) అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం.. బండ్లగూడ నూరీనగర్కు చెందిన ఫాతిమా బేగం తన భర్తతో కలిసి ఓ పెళ్లి వేడుక నుంచి తిరిగి స్కూటర్పై ఇంటికి వస్తోంది. ఈ సమయంలో చాంద్రాయణగుట్ట సమీపంలో వేగంగా వచ్చిన టిప్పర్ లారీ స్కూటర్ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఫాతిమా బేగం తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే భర్తతో పాటు ఇద్దరు చిన్నారులు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ వాహనంతో అక్కడి నుంచి పరారయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తూ పరారైన టిప్పర్ లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతుండగా, స్థానికులు హిట్ అండ్ రన్ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


