హైదరాబాద్ నగరంలో హృదయాన్ని కదిలించే ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు, భర్త నిర్లక్ష్యం, పుట్టింట్లో ఎదురైన అవమానాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. హుస్సేన్సాగర్లో దూకి ప్రాణాలు తీసుకోవాలని భావించిన ఆమె జీవితంలో చివరి క్షణంలో జరిగిన పరిణామం కొత్త మలుపు తిప్పింది.
సమాచారం ప్రకారం, తీవ్ర నిరాశలో ఉన్న ఆమె ఇద్దరు పిల్లలను తీసుకుని హుస్సేన్సాగర్ వైపు వెళ్లింది. అదే సమయంలో మార్గమధ్యంలో కనిపించిన రాంగోపాల్పేట్ పోలీస్స్టేషన్ బోర్డు ఆమెను ఒక్కసారిగా ఆలోచనలో పడేసింది. చివరకు ధైర్యం చేసి పోలీస్స్టేషన్లోకి వెళ్లింది.
స్టేషన్లో ఆమె పరిస్థితిని గమనించిన పోలీసులు వెంటనే స్పందించారు. ముందుగా ఆకలితో ఉన్న తల్లీబిడ్డలకు ఆహారం అందించి, ఆమెకు ధైర్యం చెప్పారు. అనంతరం ఆమెతో మాట్లాడి సమస్యల గురించి తెలుసుకున్నారు.
భర్త వదిలేయడం, పుట్టింట్లో అవమానాలు ఎదురుకావడం వల్ల తీవ్రంగా కుంగిపోయిన ఆమెకు పోలీసులు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహించారు. “చావు సమస్యలకు పరిష్కారం కాదు.. పిల్లల భవిష్యత్తు కోసం మీరు ధైర్యంగా నిలబడాలి” అంటూ ఆమెకు మానసికంగా ధైర్యానిచ్చారు.
అనంతరం ఆమెను సఖి సెంటర్కు తరలించి, అవసరమైన పూర్తి సహాయం అందించేలా చర్యలు చేపట్టారు. పోలీసుల మానవత్వం, సమయస్ఫూర్తి కారణంగా ముగ్గురి ప్రాణాలు నిలిచాయని స్థానికులు ప్రశంసిస్తున్నారు.


