కర్ణాటక(Karnataka)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొట్టడంతో ట్రాక్టర్ అదుపుతప్పి వంతెనపై నుంచి కిందపడిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడాది చిన్నారితో పాటు ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది గాయపడ్డారు.
ఈ ప్రమాదం మునీరాబాద్ Munirabad సమీపంలోని వంతెనపై జరిగింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో మొత్తం 16 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.
హులిగమ్మ అమ్మవారి దర్శనానికి భక్తులు ట్రాక్టర్లో వెళ్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ వంతెనపై నుంచి కిందపడిపోయి తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
మృతులు సండూరు( Sandur),కుడ్లిగి( Kudligi) ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘటనాస్థలాన్ని కొప్పల, విజయనగర జిల్లాల ఎస్పీలు పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


