నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్లో ఏర్పాటైంది. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వర్చువల్గా దీనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు.
నిజామాబాద్లో పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 అక్టోబరు 1న మహబూబ్నగర్ సభలో ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబరు 4న కేంద్ర వాణిజ్యశాఖ దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసేదీ అందులో పేర్కొనలేదు. తాజాగా నిజామాబాద్లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. దానికి ఛైర్మన్గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నేత పల్లె గంగారెడ్డిని నియమించింది.
పసుపు బోర్డుతో అనేక రంగాలకు ప్రయోజనం కలుగుతుందని ఎంపీ అర్వింద్ అన్నారు. మౌలిక వసతులు కల్పిస్తే పరిశ్రమలు వస్తాయని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ భూస్థాపితం కాబోతుందని, రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారన్నారు. ఈ సందర్బంగా మంత్రి తుమ్మలపై పలు ఆరోపణలు చేశారు. తుమ్మల వయసుకు తగ్గట్లు ప్రవర్తించాలన్నారు. ఏ పార్టీలో ఉన్నారో తుమ్మలకు తెలుసా అని ప్రశ్నించారు. తుమ్మలకు దమ్ముంటే చెరుకు ఫ్యాక్టరీ తెరిపించాలని ధర్మపురి అర్వింద్ సవాల్ విసిరారు.