2024 లోక్ సభ ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. మే 25న ఆరు రాష్ట్రాలు , రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో ఆరో దశలో 58 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఏడు నియోజకవర్గాలు, హర్యానాలోని మొత్తం పది స్థానాలకు ఆరోదశలో ఎన్నికలు జరగడం విశేషం. హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కత్తార్ ఈ సారి లోక్ సభకు పోటీ చేస్తున్నారు. బరిలో ఉన్న ప్రముఖుల్లో మేనకా గాంధీ, నవీన్ జిందాల్, రాజ్ బబ్బర్ వంటి వారు ఉన్నారు.
విజయవంతంగా ఐదు దశల్లో లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. ఆరోదశలో 58 నియోజకవర్గాల్లో పోలింగ్ కు రంగం సిద్ధమైంది.. జూన్ 1న ఏడో దశతో పార్లమెంటు ఎన్నికల పర్వం పూర్తవుతుంది. మే 25న ఆరో దశలో 889 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జమ్మూ కశ్మీర్ లోని అనంతనాగ్ -రజౌరీ లోక్ సభ నియోజక వర్గానికి మే 7న జరగాల్సిన ఎన్నికను ఎన్నికల కమిషన్ వాయిదా వేయడంతో మే 25న పోలింగ్ జరుగుతోంది. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మహ బూబా ముఫ్తీ, గులాం నబీ అజాద్ ఈ స్థానం నుంచి పోటీ పడడం విశేషం. ఆరోదశలో బీహార్ లో 8 నియోజకవర్గాలు, హర్యానాలో పది, జార్ఖండ్ లో నాలుగు, ఒడిశాలో ఆరు, ఉత్తరప్రదేశ్ లో 14, పశ్చిమ బెంగాల్ లో 8, ఢిల్లీలో ఏడు నియోజకవర్గాలు, జమ్మూ కశ్మీర్ ఒక స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆరో దశలో అదృష్టం పరీక్షించుకుంటున్న ప్రముఖుల్లో సుల్తాన్ పూర్ నుంచి మేనకా గాంధీ, కురుక్షేత్ర నుంచి నవీన్ జిందాల్ కర్నాల్ నియోజకవర్గం నుంచి హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కత్తార్, గుర్ గావ్ నుంచి రాజ్ బబ్బర్, ఇతరులు ఉన్నారు.
ఆరో దశలో అందరి దృష్టి న్యూఢిల్లీలోని ఏడు లోక్ సభ స్థానాల పైనే. న్యూఢిల్లీ నియోజకవర్గంలో దివంగత సుష్మాస్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతి తో పోటీ పడుతున్నారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీ స్థానం లో క్రికెటర్ మనోజ్ తివారీ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కన్హయ్య కుమార్. ఇక నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఉదిత్ రాజ్ కాగా, బీజేపీ అభ్యర్థి యోగేంద్ర చందోలియా. కీలకమైన చాందినీ చౌక్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రవీణ్ ఖండేల్ వాల్ కాంగ్రెస్ అభ్యర్థి జై ప్రకాశ్ అగర్వాల్ తో పోటీ పడనున్నారు.
2019లో భారతీయ జనతా పార్టీ పదికి పది స్థానాలు గెలుచుకున్న రాష్ట్రం హర్యానా. ఈ సారి కమల దళం క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటోంది. మూడేళ్లుగా సాగిన రైతు ఉద్యమం వేడి హర్యానాలో ఇంకా చల్లారలేదు. రైతు ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చట్టం చేయాలన్న తమ డిమాండ్ నెరవేరనందుకు రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఫలితంగా చాలా నియోజకవర్గాల్లో రైతుల నుంచి బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. మోదీ మ్యాజిక్ ఈ సారి ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. కీలకమైన రాష్ట్రాలలో పశ్చిమ బెంగాల్ ఒకటి. ఆరో దశలో 8 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. పోటీ ఎదుర్కొం టున్న ప్రముఖుల్లో జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ, సయాన్ బెనర్జీ, సౌమేందు అధికారి వంటి వారు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లో కీలకమైన అలహాబాద్, అజం గఢ్, ప్రతాప్ గఢ్ అంబేద్కర్ నగర్, బస్తీ తో సహా 14 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్ నుంచి హేమాహేమీలు గోదాలో నిలుస్తారు. ఏడో దశలో జూన్ 1న మిగతా 57 నియోజకవర్గాలకు ఎన్నికలు ముగిస్తే, 2024 లోక్ సభ ఎన్నికలు సంపూర్ణ మైనట్లే.


