ఏపీలో 58 అసెంబ్లీ స్థానాలు ఎనిమిది లోక్సభ స్థానాలకు మినహా అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు కాంగ్రెస్ పార్టీ. ఏపీ ఎన్నికల్లో కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేయా లని కాంగ్రెస్ ఎన్నికల కమిటీ నిర్ణయించింది. మిగిలిన చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది. వైసీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి పోటీలో ఉండగా… కాంగ్రెస్ తరుపున కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల నిలిచారు.
రాజమండ్రి పార్లమెంట్ బరిలో గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం పోటీ చేయనున్నారు. మాజీ ఎంపీ పల్లం రాజును కాంగ్రెస్ అధిష్టానం కాకినాడ నుంచి బరిలోకి దింపనుంది. విశాఖ పార్లమెంట్ బరిలో సినీ నిర్మాత సత్యారెడ్డి, అలాగే ఏలూరు లోక్సభ బరిలో లావణ్య, అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్, రాజంపేట నుంచి నజీర్ అహ్మద్, చిత్తూరు బరిలో చిట్టిబాబు, హిందూపురం నుంచి షాహీన్ పేర్లను ప్రకటించింది. అయితే సీనియర్ నేత రఘువీరా రెడ్డి మాత్రం ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నారు. ఏపీలో 117 అసెంబ్లీ,17 లోక్ సభ స్థానాలపై సీఈసీలో చర్చ జరిగింది. వీటిలో 58 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ పెండింగ్ పెట్టింది. నంద్యాల, తిరుపతి, అనంత పురం, కర్నూలు, విజయవాడ, అరకు, గుంటూరు, అమలాపురం లోక్ సభ స్థానాలను పెండింగ్లో ఉంచింది. కమ్యూనిస్టులు, ఇతర ప్రతిపక్షాలకు సీట్ల కేటాయింపు నేపథ్యంలో కొన్ని స్థానాలను ఏపీ కాంగ్రెస్ పార్టీ పెండింగ్లో పెట్టింది.