ఆంధ్రప్రదేశ్లో ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో చర్యలు చేపడుతోంది. కామన్ గుడ్ ఫండ్ — CGF కింద రాష్ట్రవ్యాప్తంగా 706 ఆలయాలకు నిధులు మంజూరు చేసినట్లు దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం — TTD సహకారంతో ప్రతి నియోజకవర్గంలో 25 నుంచి 35 ఆలయాలను నిర్మించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రూ.832 కోట్లతో ఆలయాల అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాల నుంచి నివేదికలు అందిన వెంటనే మరిన్ని ఆలయాలకు కూడా నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఇక ధూపదీప నైవేద్య పథకం కింద రాష్ట్రంలోని 6,170 ఆలయాలకు ప్రతి నెల రూ.10 వేల చొప్పున నిధులు విడుదల చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. అర్చకుల బ్యాంకు ఖాతాల్లోకే నేరుగా మొత్తం రూ.74 కోట్ల 4 లక్షల నిధులను జమ చేస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా భజన మందిరాల నిర్మాణానికీ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే 679 భజన మందిరాల నిర్మాణానికి రూ.113 కోట్ల 25 లక్షలు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు.అదేవిధంగా కొత్తగా మరో 5 వేల భజన మందిరాల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.750 కోట్లు మంజూరు చేసిందన్నారు.
రాష్ట్రంలోని ఆలయాల పరిపాలన బలోపేతానికి కూడా చర్యలు తీసుకుంటున్నామని… ఇప్పటివరకు 956 ఆలయాలకు ధర్మకర్తల మండళ్లను నియమించినట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఆధ్యాత్మిక అభివృద్ధితో పాటు ఆలయాల పరిరక్షణ, సౌకర్యాల మెరుగుదల, భక్తులకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.


