తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత పంపిణీని జూన్ 2 నుంచి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
ఈ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లాలో అధికారికంగా ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మరింత వేగంగా అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
మంగళవారం గృహనిర్మాణ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పూర్తి విధివిధానాలను ఈ నెల 21న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం అవసరమైన స్థలాలను వెంటనే గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు.
హైదరాబాద్లో సొంత స్థలాలు ఉన్న అర్హులైన వారికి ఈ నెలాఖరులోపు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల ఆక్రమణల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని… ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


