స్థానిక సంస్థల ఎన్నికలపై ఏం చేయాలి..? ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలోనే కాదు. కాంగ్రెస్ పార్టీలోనూ ఇదే చర్చ జోరుగా సాగుతోంది.ఎలక్షన్లు నిర్వహించేందుకు ఓవైపు గడువు ముంచుకొస్తుండడం మరోవైపు బీసీల జనాభా లెక్కలు తేలకపోవడంతో ఏం చేయాలన్న దానిపై నేతల మధ్య చర్చోప చర్చలు సాగుతు న్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నిల్లో హస్తం పార్టీ ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలు నిర్వహించాలన్న ఒత్తిడి పెరుగుతుండడంతో రేవంత్ సర్కారు ఏం చేయబోతోందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణలో సార్వత్రిక సమరం పూర్తైంది. మొన్నటి వరకు ఎన్నికల కారణంగా ప్రచారానికి పరిమితమైన నేతలు మళ్లీ తమ రోజువారీ కార్యకలాపాల్లో వేగం పెంచారు. అటు ప్రభుత్వం తరఫునా చేపట్టే కార్యక్ర మాలు ఊపందుకున్నాయి. దీంతో ఇప్పుడు రాజకీయ నేతల దృష్టి అంతా స్థానిక సంస్థల ఎన్నికల పై పడింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ సర్పంచ్ల పదవీ కాలం ఫిబ్రవరిలోనే పూర్తైంది. అయితే మొన్నటి వరకు పార్లమెంటు ఎన్నికల హడావిడి ఉండడంతో స్థానిక సమరం దిశగా ప్రభుత్వాలు దృష్టి సారించడానికి కుదరని పరిస్థితి. ఇప్పుడు అవి కూడా పూర్తైపోవడంతో వచ్చే నెలలో పంచాయతీ ఎలక్షన్ల ను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఇలాంటి వేళ కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చ మొదలైంది. అదే రిజర్వేషన్ల అంశం. అవును ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు కారణం తెలంగాణ శాసనసభ ఎన్నికల సమ యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీయే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపును అత్యంత ప్రతిష్టాత్మ కంగా భావించిన హస్తం పార్టీ బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీనిచ్చిం ది. దీంతో పెద్ద ఎత్తున బీసీల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడడం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి.
పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఎన్నికల వేళ ఇచ్చిన హామీ లను నిలబెట్టు కునే దిశగా సీఎం రేవంత్ రెడ్డి పాలన ప్రారంభించారు. ఇచ్చిన హామీ మేరకు బీసీలకు సంబంధించి కుల గణన చేసేం దుకు అసెంబ్లీలో తీర్మానించారు. కానీ, ఇంతలోనే లోక్సభ ఎన్నికల షెడ్యూలు రావడం, ఎలక్షన్ కోడ్ కారణంగా కులగ ణన ప్రారంభం కాలేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య స్థానిక ఎన్నికలపై ఏం చేయాలన్న అంశంలో మల్లగుల్లాలు పడుతోంది రేవంత్ సర్కారు. ఓవైపు ఇప్పటికే సర్పంచ్ల పదవీ కాలం పూర్తైంది. దీంతో గత కొన్ని నెలలుగా ప్రత్యేక అధికారుల కనుసన్న లలోనే గ్రామ పంచాయతీల పాలన సాగుతోంది. అలాగని ఎక్కువ కాలం స్పెషలాఫీసర్ల పాలనలో వీటిని ఉంచకుండా సకాలంలోనే ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. ఇందుకు ఉన్న కారణాల్లో ప్రధానమైనది నిధులు.రాజ్యాంగంలోని 73వ సవరణ చట్టం ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఓసారి పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలి. సాంకేతిక కారణాలు, రాజకీయ పరమైన కారణాలతో ఎలక్షన్లు వాయిదా వేస్తే కేంద్రం నుంచి ఆయా గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు నిలిచిపోతాయి. ఫలితంగా స్థానిక సంస్థల అభివృద్ధి కుంటుపడు తుంది. చివరకు ఆ ప్రభావం అంతా రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుంది.
ఈ నేపథ్యంలోనే ఎన్నికల నిర్వహణ చేపట్టాలంటే బీసీల రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. పోనీ కులగణన చేసినా అదీ అంత త్వరగా తేలే విషయమూ కాదు. రాష్ట్రంలో ఇప్పటికే 52 శాతానికి మించి బీసీలున్నారు. దీంతో లెక్కలు తేల్చేందుకు చాలా సమయం పడుతుంది. అలాగని ఎన్నికలు నిర్వహిద్దామని ముందుకు వెళ్లాలంటే బీసీలు అంగీకరించే పరిస్థితు లు లేవు. దీంతో ఏం చేయాలన్న దానిపై అధికార పార్టీ తలపట్టు కుంటోందన్న అభిప్రాయం వ్యక్తమవు తోంది. నిజానికి కులగణన విషయం అంత త్వరగా తేలేది కాదన్న ఆలోచనలో ఉన్న ప్రభుత్వం గత బీఆర్ఎస్ హయాంలో ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని మొదట ఆలోచించింది. గతంలో పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఉండేవి. అయితే మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి కుదిస్తూ గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారా న్ని సవాలు చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం వచ్చే పంచా యతీ ఎన్నికలలోపు రిజర్వేషన్ల లెక్కలను తేల్చాలని ఆదేశించింది. ఇందుకు అనుగుణంగానే బీసీ రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో 42 శాతానికి పెంచుతామంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీనిచ్చింది. ఇప్పుడు హస్తం పార్టీ అధికారంలోకి రావడంతో పాత పద్దతి అమలు చేస్తే తమకు అన్యాయం జరుగు తుందని బీసీ సంఘాలు ఒత్తిడి చేస్తున్నాయి.
మరోవైపు అన్ని వ్యవహారాలు కొలిక్కి వచ్చినా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ భారీ ప్రక్రియేనని చెప్పాలి. తెలంగాణ లో మొత్తం 12 వేల 814 గ్రామ పంచాయతీలు, 88 వేల 682 వార్డులున్నాయి. 620 జడ్పీటీసీ స్థానాలు, 6473 ఎంపీటీసీ స్థానాలున్నాయి. అయితే గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు పార్టీ రహితంగా నిర్వహిస్తారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక లు మాత్రం పార్టీ గుర్తుతో జరుపుతారు.హైదరాబాద్ మినహా తెలంగాణ అంతటా స్థానిక ఎన్నికలు జరగను న్నాయి. వార్డులు, గ్రామ పంచాయతీల ఎన్నికలు ఒకసారి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు మరోసారి జరపాలి. ఉప సర్పంచు లకు పరోక్ష ఎన్నికలు ఉంటాయి. మండల పరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరిపిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తవుతుంది.మొత్తంగా ఇలాంటి పరిస్థితుల మధ్య తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల విషయం లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది అందరిలోనూ ఆసక్తిరేపుతోంది.