టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గురువారం దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఢిల్లీలో గురువారం జరిగే ఓ కీలక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఇందుకోసం గురవారం జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని కూడా వాయిదా వేశారు. చంద్రబాబు హస్తిన నుంచి తిరిగి రాగానే… కేబినెట్ భేటీని నిర్వహిస్తారని తెలుస్తోంది. అయినా కేబినెట్ భేటీని వాయిదా వేసుకుని మరీ చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నారంటే.. బీజేపీ నిర్వహించతలపెట్టిన కార్యక్రమం పెద్దదే అయి ఉంటుంది కదా. అంత లేనిది బాబు కేబినెట్ భేటీని వాయిదా వేసుకుని ఢిల్లీ వెళ్లరు కదా.
ఇటీవలే ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తానికి హస్తినను తమ వశం చేసుకోవాలన్న కమలనాథుల కల నెరవేరింది. . దీంతో ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారాన్ని అట్టహాసంగా నిర్వహించాలని బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన కీలక నేతలందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా ఆ పార్టీ ప్లాన్ చేసింది. ప్రస్తుతం ఎన్డీఏలో బీజేపీ తర్వాత అత్యధిక సంఖ్యలో ఎంపీలను కలిగిన పార్టీ తెలుగు దేశం పార్టీ. అందులోనూ చంద్రబాబు దేశ రాజకీయాల్లోనే సీనియర్ మోస్ట్ నేతగా ఉన్నారు. చంద్రబాబు పాలనను ఆదర్శ పాలన అని స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే అవకాశం దొరికినప్పుడల్లా కీర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నిర్వహించే ఏ కార్యక్రమం కూడా చంద్రబాబు లేకుండా జరగడం లేదు.
ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలంటూ బీజేపీ అధినాయకుల నుంచి చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం అందిందట. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అయితే మీరు తప్పనిసరిగా రావాల్సిందేనంటూ చంద్రబాబును కోరారట. దీంతో చంద్రబాబు తన కేబినెట్ భేటీని వాయిదా వేసుకోక తప్పలేదు. ఇటీవల ముంబైలో జరిగిన మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారానికి కూడా చంద్రబాబు స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. దీన్ని బట్టి చూస్తే బీజేపికి సంబంధించిన ఏ కీలక కార్యక్రమమైనా చంద్రబాబు లేకుండా జరగదంటే అతిశయోక్తి కాదేమో.