బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలపై తీగ లాగుంతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ క్రమంలో ఇప్పటికే థర్మల్ ప్లాంట్ల వ్యవహారంలో న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్లు కొద్ది రోజుల క్రితమే అసెంబ్లీ వేదికగా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక, ఎన్నికల ముందు జరిగిన మేడిగడ్డ బ్యారేజీ వ్యవహారంపైనా సీరియస్గా ఉంది తెలంగాణ సర్కారు. ఈ మొత్తం వ్యవహారంలో జ్యుడీషియల్ ఎంక్వైరీకి సిట్టింగ్ జడ్జిని కేటాయించాలంటూ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ప్రభుత్వం లేఖ రాసింది. మేడిగడ్డపై విజిలెన్స్ విచారణలో రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్, సీఏ పేర్లు ఉన్నట్లు తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణంలో కీలక వ్యక్తి ఎవరు ? కాంట్రాక్ట్ ఎలా ఫైనల్ అయింది..ఇలా అన్ని అంశాలను బయటకు తీస్తోంది.
సరిగ్గా ఇలాంటి వేళ మరో కీలక అంశంపై దృష్టి సారించింది తెలంగాణ ప్రభుత్వం. అదే ఫార్ములా ఈ రేస్. సచివాలయ బిజినెస్ రూల్స్కు విరుద్దంగా, ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసుకున్న ఈ ట్రై పార్టీ ఒప్పందంపై న్యాయపరంగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. అసలు ఎలాంటి విధివిధానాలు లేకుండానే గతేడాది రేసులు నిర్వహించారని ఆరోపించారాయన.
వచ్చే ఫిబ్రవరిలో జరగాల్సి ఉన్న ఈవెంట్ నిర్వహణ కోసం నాటి మంత్రి వర్గం, సంబంధిత శాఖ మంత్రి అనుమతి లేకుండా ఇటీవలె బదిలీ అయిన పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 55 కోట్లను నెక్స్ జెన్ అనే ప్రైవేటు కంపెనీకి చెల్లించారని.. మంత్రి చెప్పుకొచ్చారు. ఈవెంట్ నిర్వహణకు 110 కోట్లతో ఒప్పందం జరగగా..మిగిలిన 55 కోట్లను చెల్లించాలంటూ సదరు నెక్స్ జెన్ కంపెనీ నోటీసు పంపిందన్నారు భట్టి. అసలు ఈ వ్యవహారంలో ముగ్గురు వాటాదారులు ఉన్నారన్నారు మంత్రి. రేసు నిర్వహించింది ఒకరైతే, టికెట్లు అమ్మకున్నది మరొకరని, కానీ, మూడో వాటాదారైన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందేమీ లేదన్నారు. అదే సమయంలో ఫార్ములా ఈ రేసు రద్దుతో హైదరాబాద్ అభివృద్ధికి నష్టం జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలను ఖండించారు. ఈ రేసు వల్ల ఒరిగేదేం లేదని చెప్పుకొచ్చారు మంత్రి భట్టి.
తమ ప్రభుత్వంపై ప్రజలకు ఎన్నో ఆశలు, ఆకాంక్షలు ఉన్నాయంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు మంత్రి భట్టి. ప్రతి పైసా ప్రజల అవసరాల కోసమే తాము ఖర్చు చేస్తామన్నారు. తద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసుకున్న ఒప్పందాలు, ప్రజాధనం వృథాకు సంబంధించిన లెక్కలు బయటకు తీయడం ఖాయమన్న సంకేతాలు ఆయన ఇచ్చారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.