సార్వత్రిక ఎన్నికలకు మరో మూడు నెలల వరకు సమయం ఉంది. అయినా ఇప్పటికే ఏపీలో రాజకీయం సెగలు పుట్టిస్తోంది. నేతలు అటూ ఇటూ పార్టీలు మారుతున్నారు. ప్రధానంగా వైసీపీ నుంచి బయటకు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇన్ఛార్జ్ల మార్పుతో వైసీపీలో టికెట్లు గల్లంతవుతున్న వారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్. రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాంకు కర్నూలు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడంతో మనస్థాపం చెందిన ఆయన.. పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇక, పార్టీలో నెలకొన్న పరిస్థితులపై అసంతృప్తితో ఉన్న పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి కూడా పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అన్నీ అనుకున్నట్లుగా సాగితే ఈనెల 18న ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకుంటారన్న వార్తలు విన్పిస్తున్నాయి. మరోవైపు…మొన్నటికి మొన్న వైసీపీలో చేరి పది రోజులు కూడా కాకముందే బయటకు వచ్చేసిన క్రికెటర్ అంబటి రాయుడు జనసేన పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారన్న వార్తలు వస్తున్నాయి. క్రికెట్ కోసమే వైసీపీకి రాజీనామా చేశానంటూ ట్వీట్ చేసిన అంబటి.. ఒకటి రెండు రోజులు కూడా కాకముందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. సుమారు రెండు గంటలపాటు ఇరువురూ చర్చించుకోవడంతో అంబటి రాయుడు జనసేనలో చేరతారన్న వాదనలకు బలం చేకూరుతోంది.
మరోవైపు.. టీడీపీ ఎంపీ కేశినేని నాని వైసీపీ అధినేత జగన్ వెంట నడవాలని నిర్ణయించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. వెల్లంపల్లి, దేవినేని అవినాష్తో కలిసి తాడేపల్లికి వచ్చిన ఆయన.. సీఎం జగన్తో సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో పోటీ అంశంపై చర్చించారు. ఇక, టీడీపీలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, సొంత వ్యాపారాలు సైతం పార్టీ కోసం వదులుకున్నట్లు చెప్పుకొచ్చారు నాని.
అటు..నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. కేశినేని నానిని వైసీపీ కోవర్టుగా అభివర్ణించిన ఆయన… రానున్న ఎన్నికల్లో గెలిచే సీన్ లేదంటూ విమర్శించారు. నువ్వెంత-నీ స్థాయి ఎంత అంటూ కేశినేనిని ఉద్దేశిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు బుద్దా వెంకన్న.
మొత్తంగా చూస్తే..ఏపీలో ఇప్పుడే రాజకీయ వలసలు ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో ఇంకే స్థాయిలో ఉంటాయన్నది చర్చనీయాంశంగా మారుతోంది.