మనదేశంలో గుజరాత్కు ఒక ప్రత్యేకత ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ స్వంతరాష్ట్రం కావడమే గుజరాత్ ప్రత్యేకత. అంతేకాదు బీజేపీలో నెంబర్ టూగా పేరున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్వంత రాష్ట్రం కూడా గుజరాతే. 1998 నుంచి గుజరాత్లో బీజేపీ వరుస విజయాలు సాధిస్తోంది. గుజరాత్లో మొత్తం 26 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. గత రెండు లోక్సభ నియోజకవర్గాల్లో గుజరాత్లో మొత్తం 26 సీట్లను క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి కూడా హ్యాట్రిక్ కొట్టాలని కమలం పార్టీ భావిస్తోంది.
గుజరాత్లోని మొత్తం 26 నియోజకవర్గాలకు మే ఏడో తేదీన పోలింగ్ జరగాలి. అయితే పోలింగ్కు ముందే సూరత్లో బీజేపీ విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభానీని నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. అలాగే ఇండిపెండెంట్లు అందరూ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో సూరత్లో బీజేపీ ఏకగ్రీవంగా గెలుపొందింది. ఫలితంగా 25 సెగ్మెంట్లకే పోలింగ్ జరపడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. గుజరాత్లో ప్రధాని నరేంద్ర మోడీ ఒక బ్రాండ్ గా మారారు. అలాగే పటేల్ సామాజికవర్గం మద్దతు ఉండటంతో భారతీయ జనతా పార్టీ ఎవరూ ఊహించని రీతిలో బలపడింది. 1980 నుంచి పటేళ్లు. కమలం పార్టీకి గట్టి మద్దతుదారులుగా ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో హిందూత్వ అజెండాతో పాటు బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ కూడా కీలకంగా మారింది. గుజరాత్లో ప్రధానంగా నాలుగు ప్రాంతాలున్నాయి. ఇందులో మొదటిది. సౌరాష్ట్ర కచ్. ఈ ప్రాంతంలో మొత్తం ఎనిమిది లోక్సభ నియోజకవర్గాలున్నాయి. సౌరాష్ట్ర కచ్ ప్రాంతం మొదటినుంచి బీజేపీకి అండగా నిలబడింది. రెండోది ఉత్తర గుజరాత్ ప్రాంతం. ప్రతిష్టాత్మకమైన గాంధీనగర్ నియోజకవర్గం…ఉత్తర గుజరాత్ ప్రాంతంలోనే ఉంది. ఉత్తర గుజరాత్ ప్రాంతంలో మొత్తం ఏడు లోక్సభ సెగ్మెంట్లున్నాయి. దక్షిణ గుజరాత్లో మొత్తం ఐదు సెగ్మెంట్లున్నాయి. ఇందులో సూరత్, భరోచ్, నవ్సారీతో పాటు మరో రెండు నియోజకవర్గాలున్నాయి. కాగా మధ్య గుజరాత్లో మొత్తం ఆరు నియోజకవర్గాలున్నాయి. ఇందులో వడోదర, దాహోద్, పంచ్మహల్, ఛోటా ఉదయ్పూర్తో పాటు మరో సెగ్మెంట్లున్నాయి.
గుజరాత్లోని గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటోంది. దీనికి ప్రధాన కారణం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మరోసారి ఇక్కడ్నుంచి పోటీ చేయడమే. మూడో విడతలో భాగంగా మే ఏడో తేదీన గాంధీనగర్లో పోలింగ్ జరుగుతుంది. అమిత్ షా ఆరెస్సెస్ నుంచి ఎదిగొచ్చిన నేత. కాలేజీ రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో చురుకుగా పనిచేశారు. ఆ తరువాత 1987లో బీజేపీలో చేరారు. అప్పటినుంచి కమలం పార్టీలో అమిత్ షా జైత్రయాత్ర ప్రారంభమైంది. బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగారు. గుజరాత్ బీజేపీలో పనిచేస్తున్నప్పుడు నరేంద్ర మోడీతో ఆయనకు అనుబంధం ఏర్పడింది. నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా కూడా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రస్తుతం బీజేపీలో అమిత్ షా నెంబర్ టూగా వ్యవహరిస్తున్నారు.2019 ఎన్నికల్లో బీజేపీ టికెట్పై పోటీ చేసిన అమిత్ షా ఐదు లక్షలపై చిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో తొలిసారి ఆయన లోక్సభలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో మరోసారి గాంధీనగర్ నుంచి అమిత్ షా పోటీ చేస్తున్నారు.
గాంధీనగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థినిగా సోనాల్ పటేల్ బరిలో ఉన్నారు. గుజరాత్ కాంగ్రెస్లో సోనాల్ పటేల్ సీనియర్ రాజకీయ వేత్త. ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శిగా ఆమె కొనసాగుతున్నారు. సోనాల్ పటేల్ ఉన్నత విద్యావంతురాలు. సోనాల్ వృత్తిరీత్యా ఆర్కిటెక్చర్. సెంటర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ నుంచి ఆమె డిగ్రీ తీసుకున్నారు. దేశవ్యాప్తంగా అనేక ఆర్కిటెక్చర్ సంస్థలతో సోనాల్ పటేల్కు అనుబంధం ఉంది. గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీకి దుర్భేద్య మైన కోటలాంటిది. 1989 నుంచి గాంధీనగర్లో మరో పార్టీ జెండా ఎగరలేదు. 1967 నుంచి లెక్కలు తీస్తే గాంధీనగర్ నియోజకవర్గంలో బీజేపీ తొమ్మిది సార్లు గెలిచింది. కాంగ్రెస్ పార్టీ కేవలం మూడుసార్లే విజయం సాధించింది. గాంధీనగర్ నియోజకవర్గ పరిధిలోనే మహాత్మాగాంధీ ఏర్పాటుచే సుకున్న సబర్మతి ఆశ్రమం ఉంది. ఇదొక విశేషం. భారతరత్న, బీజేపీ సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ గాంధీనగర్ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు గెలుపొందారు.


