యాదాద్రి భువనగిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపై దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందన్నారు. ఇందిర రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గుండా రాజ్యం చలాయిస్తున్నారని ఆరోపించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, కాంగ్రెస్ పార్టీ తమ కార్యకర్తలను పంపి దాడులు చేయించడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు.
ఎన్నుకున్న ప్రజలతో పాటు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బిఆర్ఎస్ కార్యకర్తలపై, నాయకులపై, పార్టీ కార్యాలయాలపైన దాడులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. పదేళ్ల పాటు ప్రశాంతంగా కొనసాగిన తెలంగాణ రాష్ట్రం, ఇవాళ అరాచకాలకు చిరునామాగా మారిందని, దాడులు, గుండాగిరి తమ మార్కు పాలన అని
కాంగ్రెస్ పార్టీ మరోసారి నిరూపించుకుంటుందన్నారు.
మా పార్టీ కార్యకర్తల జోలికి, కార్యాలయాల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తామని కేటీఆర్ హెచ్చరించారు. వెంటనే బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు, వారి వెనుక ఉన్న నలగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదేనా ఇందిరమ్మ రాజ్యం: హరీశ్రావు
ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అని హరీశ్ రావు అన్నారు. “ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ కాంగ్రెస్ వచ్చాక దాడుల విష సంస్కృతిని ప్రోత్సహిస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలతో దాడులు చేస్తే, ఆ పార్టీకి చెందిన నాయకులు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఇదేనా మీ సోకాల్డ్ ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా మీ సోకాల్డ్ ప్రజా పాలన? పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇలాగే దాడులు జరిగి ఉంటే మీకు అడ్డగోలుగా మాట్లాడే పరిస్థితులు ఉండేవా? బీఆర్ఎస్ పార్టీపైన గోబెల్స్ ప్రచారం చేసే అవకాశం ఉండేదా? పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో, ఏడాది కాంగ్రెస్ పాలనలో అశాంతి, అలజడి నెలకొన్నది” .. అని హరీశ్ రావు అన్నారు.