దేశంలో మనీ, మద్యం, మాదకద్రవ్యాల పాలిటిక్స్ ఓ రేంజ్లో నడుస్తున్నాయి. వేలకోట్లల్లో పట్టుబడ్డ సొత్తే ఇందుకు సాక్ష్యం. అవును… ఎన్నికల కోడ్ ఉన్నా… ఎవరెన్ని ఆంక్షలు పెట్టినా లెక్క చేయకుండా జనాన్ని ప్రలోభ పెట్టి ఓట్లు దండుకునే పనిలో పడ్డాయి రాజకీయ పార్టీలు. ఎన్ని అడ్డదారులు తొక్కినా ఫర్వాలేదు… ఎన్ని కోట్లయినా లెక్కలేదు గెలిస్తే చాలంటున్నారు. అందుకే లోక్సభ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వేల కోట్లల్లో నగదు, మద్యం, డ్రగ్స్ పట్టుబడ్డాయి.
ప్రజాస్వామ్యబద్దంగా జరగాల్సిన ఎన్నికలు గాడి తప్పుతున్నాయి. చెప్పడానికే శ్రీరంగనీతులు కానీ,.. మేం పాటించ మన్న రీతిలో ఎలక్షన్ రూల్స్ని గాలికొదిలేస్తున్నారు నేతలు. అందుకే యావత్ దేశమే విస్తుపోయేలా తొలి దశ పోలింగ్ జరగకముందే 4 వేల 650 కోట్ల నగదును పట్టుబడటం.. అదీ రోజుకు సగటున 100 కోట్లు అని లెక్కతేలడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిన లెక్కల ప్రకారం.. మార్చి 1వ తేదీ నుంచి ఈ నెల 15 వరకు దేశవ్యాప్తంగా 45 రోజుల వ్యవధిలో 4 వేల 650 కోట్ల విలువైన డబ్బు, మద్యం, ఇతర తాయిలాలు, మాదకద్రవ్యాలను సీజ్ చేసినట్టు ఈసీ వెల్లడించింది. ఇందులో నగదు 395.39 కోట్లు కాగా, బంగారం, వెండి వంటి విలువైన లోహాల రూపంలో 562.10 కోట్లు పట్టుబడింది. అలాగే 489.31 కోట్ల విలువ చేసే 3.58 కోట్ల లీటర్ల మద్యం కూడా పట్టుపడింది.
ఇక పట్టుబడిన వాటిలో సింహభాగం డ్రగ్స్దే. సీజ్ చేసిన మొత్తం 4 వేల 658.16 కోట్లలో మాదక ద్రవ్యాల వాటానే 45 శాతం వరకూ ఉంది. అధికారులు జరిపిన తనిఖీల్లో మొత్తం 2 వేల 68.85 కోట్ల విలువ చేసే డ్రగ్స్ దొరికాయి. 2019 ఎన్నికల సమయంలో ఒక వేయి 279.9 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇక టివిలు, ఫ్రిజ్లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు, బహుమతుల రూపంలో ఒక వేయి 142.49 కోట్ల దాకా పట్టుబడ్డాయి. 75 ఏళ్ల లోక్సభ ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధిక మొత్తం అని ఈసీ పేర్కొంది. గత లోక్సభ ఎన్నికల సమయంలో 3 వే 475 కోట్లకు పైగా పట్టుబడింది. అప్పటితో పోలిస్తే ఇది 34 శాతం అధికమని తెలిపింది. సమగ్ర ప్రణాళిక, సంయుక్త కార్యాచరణ, దర్యాప్తు సంస్థలు, భద్రతా బలగాల మధ్య సమన్వయంతోపాటు పౌరుల సహకారంతోనే ఇంత పెద్ద మొత్తంలో స్వాధీ నం చేసుకోగలిగామని ఈసీ తన ప్రకటనలో తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు వివిధ రూపాల్లో పట్టుబడిన 4 వేల 658.16 కోట్లలో రాజస్థాన్ నెంబర్ 1 స్థానంలో ఉంది. మొత్తం 778.52 కోట్లు స్వాధీనం చేసుకోవడంతో రాజస్థాన్ అగ్రస్థానంలో నిలిచింది. ఇక 605 కోట్లతో గుజరాత్ రెండో స్థానంలో ఉండగా… 460.8 కోట్లతో ఆ తర్వాత స్థానంలో తమిళనాడు నిలిచింది. అదే విధంగా మహారాష్ట్రలో 431.3 కోట్లు, పంజాబ్లో 311.8 కోట్లు పట్టుబడింది. ఎన్నికల అక్రమాలు, అవకతవకల్లో అత్యల్పంగా లఢక్, లక్షద్వీప్ ప్రాంతాలు నిలిచాయి.
ఇకపోతే ఆంధ్రప్రదేశ్లోనూ భారీగానే సొత్తును సీజ్ చేశారు ఎన్నికల అధికారులు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 125.97 కోట్ల విలువజేసే సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా పేర్కొంటూ ఆ వివరాలు వెల్లడించారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తంలో 32.15 కోట్ల నగదు, 19.72 కోట్ల విలువైన లిక్కర్, 4.06 కోట్ల విలువైన డ్రగ్స్, 57.14 కోట్ల విలువైన ప్రెషస్ మెటల్స్, 12.89 కోట్ల విలువైన ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అంతర్ రాష్ట్ర చెక్పోస్టులు, రాష్ట్ర వ్యాప్తంగా చెక్పోస్టులు, పటిష్టమైన నిఘా, అధికారులు, పోలీసులు నిరంతరాయంగా గస్తీకాయడంతోపాటు పౌరుల భాగస్వామ్యం, సాంకేతిక సహకారం వల్లే ఈ సొత్తును స్వాధీనం చేసుకోగలిగామన్నారు ముఖేష్కుమార్.