లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అందరి కన్నా ఏపీ సీఎం జగన్ ప్రచారంలో ముందున్నారు. ఇప్పటికే సిద్ధం, మేమంతా సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళ్లిన ఆయన.. మలి విడత జైత్రయాత్రకు సిద్ధమయ్యారు. రేపటి నుంచి ఎన్నికల ప్రచార భేరి మోగించనున్నారు. ప్రతి రోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలలో పాల్గొంటారు. రేపు ఉదయం పది గంటలకు తాడిపత్రిలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.
మధ్యాహ్నం 12.30 గంటలకు వెంకటగిరిలో, 3 గంటలకు కందుకూరులో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. రేపటి నుంచి మే 1 వరకు జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ను పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. ఈ నెల 29న చోడవరం, పి.గన్నవరం, పొన్నూరులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ నెల 30న కొండేపి, మైదుకూరు, పీలేరులో సీఎం జగన్ ప్రచారం నిర్వహించనున్నారు. మే 1న బొబ్బిలి, పాయకారావుపేట, ఏలూరులో జరిగే సభలకు జగన్ హాజరవుతారు.
ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా గత నెల 27న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేపట్టారు సీఎం జగన్. ఈనెల 24న శ్రీకాకుళం జిల్లా అక్కవరం వద్ద నిర్వహించిన సభతో ముగించారు. 22 రోజుల పాటు 23 జిల్లాలు, 86 నియోజకవర్గాల్లో 2వేల 188 కిలోమీటర్ల మేర సాగిన బస్సు యాత్ర పొడవునా ప్రజలు సీఎం జగన్కు బ్రహ్మరథం పట్టారు. తాజాగా మలి విడత ప్రచారానికి సిద్ధమయ్యారు.


