రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ప్రజా పాలనలో వడివడిగా అడుగులు వేస్తున్న రేవంత్ సర్కారు… ఇప్పుడు బీఆర్ఎస్ను టార్గెట్ చేసినట్లే కన్పిస్తోంది. ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 29న మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు.
ఇటీవలె ప్రాజెక్టుకు సంబంధించిన పలు పిల్లర్లు కుంగడంతో నాటి బీఆర్ఎస్ సర్కారుపై అన్ని వర్గాల నుంచి విమర్శల వాన కురిసింది. దీంతో.. అప్పట్లోనే తాము అధికారంలోకి వస్తే కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ వ్యవహారాన్ని పరిశీలించడంతోపాటు అన్ని అంశాలపై విచారణ జరిపిస్తామని తెలిపింది కాంగ్రెస్ పార్టీ. ఆ క్రమంలోనే ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న మంత్రులు, అక్కడే కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
ఈనెల 29న మొదటగా మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళతారు. అనంతరం మేడిగడ్డ వద్దకు చేరుకొని పరిశీలిస్తారు. అక్కడే కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ప్రాణహిత, కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు, ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల కలిగిన లాభ నష్టాలను ప్రజలకు వివరిస్తారు మంత్రులు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం మంత్రులు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించనున్నారు.
కేవలం ఇవే కాదు.. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం, కొత్త ఆయకట్టు స్థిరీకరణ వివరాలు వెల్లడించనున్నారు మంత్రులు. అలాగే.. ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్పై స్పష్టతనివ్వనుంది ప్రభుత్వం. వీటితోపాటు మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల సమస్యలు, వాటి పరిష్కారాలు, ఇతర అంశాలపై సమీక్ష నిర్వహింనుంది ప్రభుత్వం. ఎంతో కీలకమైన పర్యటన కావడంతో ఈ ప్రాజెక్టులతో సంబంధం ఉన్న కాంట్రాక్టర్లు, ఇతర అధికారులను సమావేశంలో పాల్గొనేలా చూడాలంటూ ఇప్పటికే ఈఎన్సీని ఆదేశించింది రేవంత్ సర్కారు.