జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్టీ అంతర్గత వ్యవహారాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. పార్టీలో ఉంటూనే పార్టీకి నష్టం చేకూర్చే నేతల పట్ల ఆయన అత్యంత సీరియస్ గా ఉన్నారు. ఇటీవల రాజమండ్రిలో జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తేల్చి చెప్పారు. రాజకీయాల్లో బయట ఉండే ప్రత్యర్థుల కంటే, మన పార్టీలో ఉంటూ మనకే గోతులు తవ్వే వారు అత్యంత ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన ఒక కీలకమైన ఉదాహరణను కూడా నేతల ముందు ఉంచారు. పౌరసరఫరాల శాఖలో బియ్యం అక్రమ రవాణా జరుగుతోందంటూ ఒక ప్రముఖ టీవీ ఛానెల్కు తప్పుడు లీకులు ఇచ్చింది సాక్షాత్తూ జనసేన పార్టీకి చెందిన ఓ నేతేనని పవన్ కళ్యాణ్ కుండబద్దలు కొట్టారు. సొంత పార్టీ నేతలే ఇలా పనిగట్టుకుని ప్రభుత్వంపై, పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేయడం ఆయనను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. అందుకే బయటి శత్రువుల కంటే మనలో ఉన్న కోవర్టులను ముందుగా ఏరివేయాలని ఆయన నిర్ణయించారు.
రాజమండ్రి సమావేశం తర్వాత జనసేనాని మాటలకే పరిమితం కాకుండా ఆచరణలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై పూర్తి స్థాయిలో నివేదికలు తెప్పించుకుంటున్నారు. పార్టీలో కొనసాగుతూనే తెరవెనుక ఇతర పార్టీలకు మేలు చేసేలా వ్యవహరిస్తున్న వారిని తక్షణమే బయటకు పంపించేయాలని పార్టీ ముఖ్య నేతలను ఆయన ఆదేశించారు. ఇలాంటి ద్రోహులు రానున్న రోజుల్లో పార్టీకి మరింత ప్రమాదకరంగా మారతారని ఆయన విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా త్వరలో జరగనున్న పంచాయతీ, మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరు సొంత పార్టీ అభ్యర్థుల ఓటమికే పనిచేసే అవకాశం ఉందని పవన్ భావిస్తున్నారు. అందుకోసమే ఎన్నికల నగారా మోగక ముందే, అటువంటి వారిని పక్కాగా గుర్తించి పార్టీ నుంచి నిర్దాక్షిణ్యంగా సాగనంపాలని పవన్ కళ్యాణ్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. పార్టీని ప్రక్షాళన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దిగాలన్నది ఆయన ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది.
పార్టీ వ్యతిరేకులను వదిలించుకునే ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, అధికారికంగా చేపట్టాలని జనసేన అధిష్టానం నిర్ణయించింది. కేవలం మౌనంగా పక్కన పెట్టడం కాకుండా, వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు జనసేన కేంద్ర కార్యాలయం నుంచే అధికారికంగా ప్రకటించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సదరు నేతలు ఏ జిల్లాకు చెందిన వారైతే, ఆ జిల్లా కమిటీల ద్వారా కూడా పత్రికా ప్రకటనలు జారీ చేయాలని సూచించారు. బహిష్కరణకు గురైన వారికి, జనసేన పార్టీకి ఇకపై ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలని చెప్పారు. ఇలా చేయడం ద్వారా ఆ కోవర్టులు భవిష్యత్తులో జనసేన పేరు చెప్పుకుని ప్రజలను గానీ, అధికారులను గానీ బురిడీ కొట్టించకుండా ముందే అడ్డుకట్ట వేయవచ్చని పార్టీ భావిస్తోంది. జిల్లాల వారీగా ఈ బహిష్కరణల జాబితాను సిద్ధం చేసి, అఫిషియల్ గా అనౌన్స్ చేసేందుకు జనసేన లీగల్ మరియు క్రమశిక్షణా సంఘం వేగంగా అడుగులు వేస్తోంది.
జనసేన పార్టీలో గత కొంతకాలంగా కొందరు నేతలు పనిగట్టుకుని అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదన్న అక్కసుతో వారు పార్టీ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారు. అనేక జిల్లాల్లో పార్టీ జిల్లా అధ్యక్షులు తమను పట్టించుకోవడం లేదని, తమకు గుర్తింపు లేదని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇంతటితో ఆగకుండా పార్టీ కేంద్ర కార్యాలయంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న ముఖ్య నేతలపై కూడా సోషల్ మీడియా వేదికగా అసత్య పోస్టులు పెడుతున్నారు. ఫేక్ ఐడీలతో సొంత నాయకులపైనే ట్రోలింగ్ కు దిగుతూ పార్టీలో గందరగోళం సృష్టిస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన సమయంలో, ఈ అంతర్గత కుమ్ములాటలు పార్టీ ఇమేజ్ కు తీవ్ర నష్టం చేకూరుస్తున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ ఈ సోషల్ మీడియా సైకోలను, అసమ్మతి వాదులను వీలైనంత త్వరగా వదిలించుకోవడమే పార్టీ భవిష్యత్తుకు మంచిదన్న కఠినమైన నిర్ణయానికి వచ్చారు.
పార్టీ అంతర్గత విచారణ, నిఘా వర్గాల సమాచారం మేరకు జనసేన అధిష్టానం ఇప్పటికే ఒక పక్కా జాబితాను సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో ఉంటూనే పార్టీకి ద్రోహం చేస్తున్న దాదాపు పది నుంచి పదిహేను మంది ముఖ్య నేతలను పార్టీ క్రమశిక్షణా సంఘం గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. వీరిపై త్వరలోనే అధికారికంగా వేటు వేయడానికి సర్వం సిద్ధమయింది. వైసీపీ లాంటి ప్రత్యర్థి పార్టీలు కూడా జనసేనను ఇంతలా డ్యామేజ్ చేయలేకపోయాయని, కానీ ఈ పది పదిహేను మంది కోవర్టులు పార్టీకి కోలుకోలేని నష్టం చేస్తున్నారని జనసేనాని గుర్తించారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ వీరి పట్ల సానుభూతి చూపకూడదని నిర్ణయించుకున్నారు. క్రమశిక్షణ లేని నాయకులు ఎంతటి వారైనా సరే, పార్టీ నుంచి బయటకు వెళ్లాల్సిందేనన్న కఠిన సందేశాన్ని ఈ చర్యల ద్వారా పవన్ కళ్యాణ్ క్యాడర్ కు పంపబోతున్నారు. మొత్తానికి జనసేనలో జరగబోయే ఈ ఆపరేషన్ ప్రక్షాళన ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారబోతోంది.


