దేశ వ్యాప్తంగా వేడి గాలుల తీవ్రత పెరిగిపోయింది. అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరిఅవుతున్నారు. సాధారణం కంటే ౩ నుంచి 4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. రానురాను 50 డిగ్రీలు చేరుకునేలా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. బలూచిస్థాన్, రాజస్థాన్ థార్ ఎడారి నుంచి వేడి గాలులు వీస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలు సహా యూపీ, మధ్యప్రదేశ్, ఢిల్లీకి హీట్వేవ్ హెచ్చరిక జారీ చేశారు.
తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇవాళ ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. వేడి గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రాష్ట్రంలోని 19 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్కు పైగా నమోదయ్యాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
వడదెబ్బ కారణంగా ఒక్కరోజులోనే 11 మంది మృతి చెందారు. అత్యవసర పరిస్థితులు తప్ప పగటిపూట ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ బండాలో నిన్న 48 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యప్రదేశ్ ఖజురహోలో 47.4 డిగ్రీల టెంపరేచర్ రికార్డయింది. ఇక ఢిల్లీలోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఢిల్లీలో 45 నుంచి 47 డిగ్రీలు టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఉదయం 7 గంటలకే 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని.. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంట్లోనే ఉండటం మంచిదని సూచిస్తున్నారు. వడదెబ్బ తగిలినట్టు ఏ మాత్రం సూచనలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.


