హైదరాబాద్ నగర పరిధిలోని ఇబ్రహీంపట్నంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై ఆమె సహ విద్యార్థి అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్కు చెందిన ఉడుతల ఉదయ్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అదే కళాశాలలో చదువుతున్న తన క్లాస్మేట్తో ఈ నెల 14న రాత్రి బయటకు వెళ్లాడు.
టీ తాగుదామని చెప్పి ఇద్దరూ కారులో దిల్సుఖ్నగర్కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో నిందితుడు మద్యం కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఇబ్రహీంపట్నం సమీపంలోని బీడీఎల్ రోడ్డులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి యువతికి కూడా బలవంతంగా మద్యం తాగించినట్టు సమాచారం.
మత్తులోకి వెళ్లిన బాధితురాలిని తర్వాత ఇబ్రహీంపట్నంలోని ఓ గదికి తీసుకెళ్లిన ఉదయ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై బాధితురాలు ఈ నెల 17న పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం నిందితుడు ఉడుతల ఉదయ్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది. యువతిని వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


