ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) రాష్ట్రాన్ని దేశ రక్షణ రంగంలో కీలక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 650 ఎకరాల్లో నిర్మించనున్న అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. పుట్టపర్తి పేరు వినగానే సత్యసాయి బాబా( Sathya Sai Baba) గుర్తుకు వస్తారని, ఆయన విశ్వశాంతి కోసం చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆపరేషన్ సిందూర్ దేశానికి గర్వకారణమని వ్యాఖ్యానించారు.
రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీ ఏర్పాటు ద్వారా దేశంలోనే అత్యాధునిక డ్రోన్ ఎకోసిస్టమ్కు శ్రీకారం చుట్టామని చెప్పారు. రూ.686 కోట్ల పెట్టుబడితో ఎనిమిది సంస్థలు ఏర్పాటవుతున్నాయని, వీటి ద్వారా సుమారు 2,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు.
ఒకప్పుడు రాయలసీమను రతనాలసీమగా పిలిచేవారని, తరువాత అనంతపురం ఎడారిలా మారిపోయిందని చంద్రబాబు అన్నారు. రాయలసీమ రూపురేఖలు మార్చాలనే సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి ఎన్ టీ రామారావు( N. T. Rama Rao) అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ఆయన ప్రారంభించిన ప్రాజెక్టులను ఇప్పుడు పూర్తి చేస్తున్నామని తెలిపారు.
సమర్థ నీటి నిర్వహణతో రాయలసీమకు జలహారతి అందించామని, కేంద్ర సహకారంతో ఈ ప్రాంతం రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. రాయలసీమను మళ్లీ రతనాలసీమగా మార్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.
కడప స్టీల్ ప్లాంట్ పనులు జూన్లో ప్రారంభమవుతాయని, 2028 నాటికి పూర్తి చేసి రాయలసీమ ప్రజలకు కానుకగా అందిస్తామని వెల్లడించారు.
దేశానికి ఆంధ్రప్రదేశ్ రక్షణ కవచంగా నిలుస్తోందని, గోల్డ్ ఉత్పత్తిలో కూడా రాష్ట్రం కీలక పాత్ర పోషించబోతుందని సీఎం అన్నారు. ఒకప్పుడు కేజీఎఫ్ బంగారానికి ప్రసిద్ధి కాగా, ఇప్పుడు జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ కొత్త గుర్తింపుగా మారుతోందన్నారు. ఈ ఏడాది 600 కిలోల బంగారం, వచ్చే ఏడాది 1,500 కిలోల బంగారం ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు( Kinjarapu Ram Mohan Naidu), రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్( Nara Lokesh),ఇతర మంత్రులు తదితరులు పాల్గొన్నారు.


