మే 15 నుంచి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.3 చొప్పున పెరిగాయి. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇంధన ధరలను పెంచాయి. అయితే ప్రపంచంలోని ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్లో ఈ పెంపు అత్యల్పమని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి.
ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచంలో అత్యంత కీలక చమురు రవాణా మార్గమైన హోర్ముజ్ జలసంధి ప్రభావితమవడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. అనేక దేశాలు వెంటనే ఆ భారం వినియోగదారులపై మోపగా, భారత్ మాత్రం దాదాపు 76 రోజుల పాటు ధరలను పెంచకుండా కొనసాగించింది.
ఈ సమయంలో ముడి చమురు ధర బ్యారెల్కు 100 డాలర్లకు పైగా వెళ్లినా ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు ధరలను స్థిరంగా ఉంచాయి. దీంతో రోజుకు సుమారు రూ.1,000 కోట్ల వరకు నష్టాలు వచ్చినట్లు సమాచారం.
పూర్తి భారం ఎందుకు వేయలేదు?
భారత్ తన అవసరాల్లో 80-85 శాతం ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర 10 డాలర్లు పెరిగితే దేశ దిగుమతి బిల్లు మరో 13-14 బిలియన్ డాలర్లు పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం దేశ వార్షిక చమురు దిగుమతి బిల్లు రూ.12-15 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. దీనికి తోడు బంగారం దిగుమతులు కూడా భారీగా పెరిగి రూ.6 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ రెండూ కలిసి విదేశీ మారక నిల్వలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి.
అయినప్పటికీ వినియోగదారులపై భారం తగ్గించేందుకు కేంద్రం గతంలో పెట్రోల్పై రూ.8, డీజిల్పై రూ.6 ఎక్సైజ్ సుంకం తగ్గించింది.
ప్రస్తుతం పెట్రోల్పై లీటరుకు సుమారు రూ.26, డీజిల్పై రూ.82 వరకు అండర్రికవరీ ఉందని అంచనా. అయినా పూర్తి భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు కలిసి నష్టాలను భరిస్తున్నాయి.
పేదలపై ప్రభావం పడకుండా నిర్ణయం
భారత్లో ఇంధన వినియోగం ధరలపై ఎక్కువగా ఆధారపడదు. రైతులకు డీజిల్ అవసరం, ట్రక్ డ్రైవర్లు రవాణా కోసం, ఆటో డ్రైవర్లు ఉపాధి కోసం ఇంధనంపై ఆధారపడాల్సిందే.
ప్రపంచ మార్కెట్ ధరలను పూర్తిగా అమలు చేసి ఉంటే పెట్రోల్, డీజిల్ ధరలు 200-300 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలా జరిగితే సమాజంలోని దిగువ 20 శాతం ప్రజలపై తీవ్ర ప్రభావం పడేదని భావించి .. ధరలు పెంచకుండా వినియోగాన్ని తగ్గించుకోవాలనే సిద్దాంతాన్ని తెరపైకి తెచ్చింది.
ఆంక్షలు కాదు.. స్వచ్ఛంద నియంత్రణే లక్ష్యం
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి దేశీయ సమస్య కాదని, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ సంక్షోభం ప్రభావమని కేంద్రం చెబుతోంది.అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ మూసివేతతో ఓడల రాకపోకలకు అంతరాయం… ఈ పరిస్థితికి ప్రధాన కారణమని పేర్కొంటోంది. ఈ పరిస్థితులను మెరుగుపరచడం అనేది భారత దేశం చేతుల్లో లేనిది.
ఇప్పటికే 82 దేశాలు అత్యవసర ఆంక్షలు, రేషన్ విధానాలు లేదా భారీ ధరల పెంపులను అమలు చేస్తున్నప్పటికీ భారత్ మాత్రం అలాంటి చర్యలకు దూరంగా ఉంది.
ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi) ప్రజలకు స్వచ్ఛందంగా ఇంధన వినియోగాన్ని తగ్గించాలని, అవసరం లేని విదేశీ పర్యటనలు తగ్గించాలని, ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని సూచించారు.
ఎందుకంటే. భారత్లో ప్రజల వద్ద దాదాపు 30,000 టన్నుల బంగారం ఉండగా, దాని విలువ సుమారు 5 ట్రిలియన్ డాలర్లు. కేవలం బంగారం దిగుమతులను సగానికి తగ్గించినా దేశ ప్రస్తుత ఖాతా లోటుపై ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది.
ఇక ఎరువుల విషయంలో కూడా ప్రభుత్వం భారీ సబ్సిడీలు కొనసాగిస్తోంది. రూ.2,200 విలువైన ఎరువు సంచిని రైతులకు కేవలం రూ.242కే అందిస్తోంది. ఇందుకోసం రూ.2.25 లక్షల కోట్ల సబ్సిడీ ఇస్తోంది.
ప్రపంచలోని 82 దేశాలు కొన్ని వారాల్లోనే ధరలు పెంచగా, భారత్ మాత్రం 76 రోజుల పాటు పూర్తిగా భారం భరించి ఇప్పుడు కేవలం రూ.3 మాత్రమే పెంచింది. ఇది లీటరుకు సుమారు 3 నుంచి 3.5 శాతం పెంపు మాత్రమేనని, ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఇదే అత్యల్ప పెంపు అని పేర్కొంటున్నారు.


