ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పైకప్పు కూలిన ఘటనాస్థలికి రెస్క్యూ బృందాలు చేరుకున్నాయి. ఘటనాస్థలిలో బండరాళ్లు, నీరు,. బురద కనిపిస్తున్నాయి. ఘటనాస్థలి నుంచి వందల మీటర్ల వరకు మట్టి పేరుకుపోయింది. మట్టిని తవ్వడానికి సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎక్కడైతే కార్మికులు చిక్కుకున్నారో.. ఆ సమీపానికి రెస్క్యూ టీం చేరుకుంటుంది.. కానీ అక్కడికి చేరుకునే క్రమంలో మట్టి, బురద ఉండడంతో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. తీవ్రంగా శ్రమిస్తున్నారు వారు లోపలికి వెళ్లడానికి. మరికొద్ది గంటల్లోనే టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ ముగిసే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటికే నిపుణులు అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు చాలా వేగంగా కొనసాగుతున్నాయి. హై టెక్నాలజీ వాడుతూ రెస్క్యూ బృందం అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఎస్ఎల్బీసీ సొరంగంలో పైకప్పు కూలిన ఘటనలో చాలా మంది కార్మికులు ప్రాణాపాయం నుంచి తప్పించుకుని బయటపడ్డారు. కానీ 8 మంది మాత్రం లోపల చిక్కుకుపోయారు. వారి కోసం రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈనెల 22న ఉదయం ఈ ఘటన జరిగిన తర్వాత నుంచి సైన్యం, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, బీఆర్వో, ఎన్జీఆర్ఐ, జీఎస్ఐ, ఎల్ అండ్ టీ తదితర ప్రఖ్యాత సంస్థల బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నాయి.
సొరంగంలో ప్రతి నిమిషానికి ఐదువేల లీటర్ల నీళ్లు ఊరుతుండడం సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. అయితే లోపల చిక్కుకున్న 8 మంది క్షేమంపై రోజురోజుకూ ఆందోళన పెరుగుతోంది. ప్రభుత్వం వారిని ఎలాగైనా రక్షించాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇవాళ్టి నుంచి సహాయక చర్యలను మరింత వేగవంతం చేశారు.