రక్షణ శాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సైనిక దళాలకు ఉపయోగించే ఆయుధాల్లో చైనా పరికరాల వినియోగంపై రక్షణ మంత్రిత్వ శాఖ కొరడా ఝుళిపించింది. ఇందుకు సంబంధించి కొన్ని కంపెనీలకు చెందిన మూడు కాంట్రాక్టులను రక్షణమంత్రిత్వ శాఖ రద్దు చేసుకుంది. వాస్తవానికి సాయుధ దళాల రవాణా అవసరాలకు మొత్తం 400 డ్రోన్లను తయారు చేయాల్సి ఉంది.
అయితే ఇప్పటికే సైనిక అవసరాలకు ఉపయోగించే డ్రోన్లలో చైనా విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్ వాడకుండా చూస్తోంది రక్షణ మంత్రిత్వ శాఖ. ఈ మేరకు ఒక ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. అయితే కొన్ని డ్రోన్లలో డైనా విడిభాగాలు ఉపయోగించినట్లు బయటపడింది. ప్రత్యేకించి 200 మీడియం ఆల్టిట్యూడ్ డ్రోన్లు అలాగే 100 హెవీ వెయిట్ లాజిస్టిక్స్ డ్రోన్లు కూడా ఉన్నాయి. ఈ విషయం గమనించిన భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. చైనా ఉపకరణాలు వాడిన కంపెనీల కాంట్రాక్టులను రద్దు చేసింది. కాగా ఈ కాంట్రాక్టుల మొత్తం విలువ రూ. 230 కోట్లు ఉంటుందన్నది ఒక అంచనా. 2023లో ఇందుకు సంబంధించిన కాంట్రాక్టు పై రక్షణ మంత్రిత్వ శాఖ సంతకం చేసింది.
కాగా భారత ప్రభుత్వం ఆర్డర్ పెట్టిన డ్రోన్లను చైనాతో 3,488 కిలోమీటర్ల మేర ఉన్న వాస్తవాధీన రేఖ వెంట మోహరించాలని గతంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ డ్రోన్లలో చైనాలో తయారైన విడి భాగాలు ఉన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో వెల్లడైంది. ఇటువంటి డ్రోన్లు ఉపయోగించడం వల్ల , దేశ రక్షణ ప్రమాదంలో పడుతుందని సైన్యానికి సంబంధించి ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అంతేకాదు సైనిక దళాల కార్యకలాపాల్లో సీక్రెసీ అనేది కూడా లేకుండా పోతుందని వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మరో ప్రమాదం కూడా పొంచి ఉంది. జూమింగ్ ద్వారా ప్రత్యర్థి దేశాలు మన డ్రోన్లను స్వాధీనం చేసుకోవచ్చు లేదా సాఫ్ట్ కిల్ చేయనూ వచ్చు అంటున్నారు రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు.
ఇటీవలి కాలంలో నిఘా, పహారా తదితర మిషన్ల సమయంలో భారత్ వాడిన కొన్ని డ్రోన్లు ఫెయిల్ అయ్యాయి. ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. ప్రధానంగా చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఈ డ్రోన్ల ఫెయిల్యూర్ కొట్టొచ్చినట్లు కనిపించింది. అంతేకాదు కిందటేడాది ఆగస్టులో రాజౌరీ సెక్టార్ లోని ఇన్ఫాంట్రీ దళం, కొన్ని డ్రోన్లను ప్రయోగించింది. అయితే సదరు డ్రోన్లు లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. దారిమళ్లి, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో కూలాయి. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై రక్షణ మంత్రిత్వ శాఖ వెంటనే దర్యాప్తు చేపట్టింది. కాగా డ్రోన్లలో సాంకేతిక లోపం ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో చైనా విడిభాగాలున్న డ్రోన్ల పై రక్షణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది.
భారత్ – చైనా సరిహద్దుల మధ్య సరిహద్దు వివాదాలు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ వివాదాలు మరింతగా ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమే అంటూ డ్రాగన్ చైనా తొండాట ఆడుతోంది. ఈ నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగం అంటూ అగ్రరాజ్యమైన అమెరికా కొన్నేళ్ల కిందటే స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ విషయంలో భారత్కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
అరుణాచల్ ప్రదేశ్ విషయంలో భారత్- చైనా మధ్య కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని భారతదేశం ఎన్నిసార్లు చెప్పినా, డ్రాగన్ చైనా వినిపించుకోవడం లేదు. అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ పనికిమాలిన వాదనలు చేస్తోంది. కొంతకాలం కిందట చైనా రక్షణమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఝూంగ్ షియాంగాంగ్ ఇదే పాట మరోసారి పాడారు. దీనిని భారత్ దీటుగా తిప్పికొట్టింది. నిరాధార వాదనలను పదే పదే వల్లెవేయడం ద్వారా వాస్తవాలు మారిపోవని డ్రాగన్ చైనాకు మరోసారి స్పష్టం చేసింది. అంతేకాదు అరుణాచల్ ప్రదేశ్ను ఆక్రమించుకోవడానికి డ్రాగన్ చైనా చేస్తున్న ప్రయత్నాలను అమెరికా తప్పుపట్టింది. ఇదిలా ఉంటే, 2020 జూన్ లో అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలోని సరిహద్దుల్లో కీలకమైన రైల్వే ప్రాజెక్టును ప్రారంభించింది చైనా. యాన్-లిన్షి రైల్వే లైన్ ప్రాజెక్ట్ గా ఇది పాపులర్. ఈ రైల్వే ప్రాజెక్టు చేపట్టడం వెనక సైనికపరమైన లక్ష్యాలు ఉన్నాయని రక్షణరంగ నిపుణులు అనుమానిస్తున్నారు. సిచువాన్ -టిబెట్ రైల్వే లైన్ ద్వారా అరుణాచల్ ప్రదేశ్ లోని సరిహద్దు ప్రాంతానికి చైనా చాలా సులభంగా ఆయుధాలను, క్షిపణులను తరలించ వచ్చని మిలటరీ అధికారులు అంటున్నారు. దీంతో సిచువాన్ -టిబెట్ రైల్వే ప్రాజెక్ట్ వివాదాస్పదంగా మారింది. అలాగే వివాదాస్పద ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టింది. గ్రామాలకు గ్రామాలే నిర్మిస్తోంది. మొత్తంమీద సరిహద్దుల దగ్గర నిఘా పెంచాలని రక్షణ మంత్రిత్వ శాఖ గట్టిగా నిర్ణయం తీసుకుంది.