అమెరికా లాస్ ఏంజెల్స్లో కార్చిచ్చు రగులుతూనే ఉంది. అమెరికా చరిత్రలోనే ఈ వైల్డ్ ఫైర్ను అతి పెద్ద ప్రకృతి వైపరీత్యంగా చెబుతున్నారు. మంగళవారం మరో 10వేల నిర్మాణాలు కాలి బూడిదయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఆ ప్రాంతమంతా పొగతో కమ్ముకోవడంతో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. భారీ అగ్నిప్రమాదంలో పారిస్ హిల్టన్ వంటి ప్రముఖులతో సహా అనేక మంది ప్రముఖ ధనవంతులు తమ ఇళ్లను కోల్పోవడంతో బీమా సంస్థలు బిలియన్ల కొద్దీ క్లెయిమ్లను ఎదుర్కొంటున్నాయి.
లాస్ ఏంజిల్స్ చరిత్రలో అత్యంత వినాశకరమైన అగ్నిప్రమాదం కాగా.. దాని చుట్టుపక్కల ప్రాంతాలను కూడా నేలమట్టం చేసింది. చివరకు కార్చిచ్చు పొగతో ప్రజల ఇళ్లు, ఆస్తుల శిథిలాలను మాత్రమే మిగిల్చింది. కానీ ఆశ్చర్యకరంగా ఈసారి భారీ గాలులతో మంటలు కొండలను సైతం చుట్టుముట్టగా.. కొన్ని ఇళ్లు మాత్రం సురక్షితంగా మంటల నుంచి బయటపడ్డాయి. అలా సురక్షితంగా ఉన్న ఇళ్లలో.. టెక్సాస్కు చెందిన రిటైర్డ్ వేస్ట్ మేనేజ్మెంట్ మొగల్ డేవిడ్ స్టెయినర్ భవనం కూడా ఉంది.
డేవిడ్ స్టెయినర్ భవనం మాలిబు మాన్షన్ ఖరీదు 9 మిలియన్ డాలర్లు. లాస్ ఏంజిల్స్ కార్చిచ్చులో చుట్టుపక్కల అన్ని భవనాలు తగలబడిపోయినా ఆయన భవనం మాత్రం చెక్కుచెదరలేదు. పొగ క్లియర్ అయ్యాక చూసుకుంటే తన భవనం అలానే ఉండటం చూసి డేవిడ్ ఆశ్చర్యపోయారట. ఇది నిజంగా మిరాకల్ అని అంటున్నారు.
తన మూడు అంతస్తుల భవనం, చుట్టుపక్కల ఇళ్లను మంటలు చుట్టుముట్టినప్పుడు ఓ స్థానిక కాంట్రాక్టర్ తనకు వీడియో పంపిచాడని.. తన బిల్డింగ్ చెక్కుచెదరకుండా ఉండటం చూసి ఆశ్చర్యపోయానని డేవిడ్ అంటున్నాడు.
మంగళవారం నుండి లాస్ ఏంజిల్స్ కౌంటీ పరిసరాల్లో ఏకకాలంలో ఆరు మంటల్లో కనీసం 11 మంది మృతి చెందారు. అవి 10,000 నిర్మాణాలను ధ్వంసం చేశాయి. అగ్నిమాపక సిబ్బంది ఇంటింటికి సోదాలు నిర్వహిస్తే మృతుల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.