కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరేందుకు సర్వం సిద్ధమైంది. నరేంద్ర మోదీ ఇవాళ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాత్రి 7.15 గంటలకు ఆయన రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని వాజ్పేయికి మోదీ నివాళులు అర్పించారు. రాజ్ఘాట్, సదైవ్ అటల్కి వెళ్లి పుష్పాంజలి ఘటించారు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ముస్తాబైంది. మోదీతో పాటు బీజేపీ సహా ఎన్డీఏ పక్షాల నుంచి సుమారు 30 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. హోమ్, డిఫెన్స్, ఫైనాన్స్, విదేశాంగ మంత్రులుగా బీజేపీ నేతలే ఉంటారని తెలుస్తోంది. మొత్తంగా కేంద్ర కేబినెట్ 78 నుంచి 81 మందితో కొలువుదీరనుందని సమాచారం. మరోవైపు మోదీ ప్రమాణస్వీకారం సందర్భంగా ఢిల్లీని అధికారులు నో ఫ్లైజోన్గా ప్రకటించారు. రాష్ట్రపతి భవన్ ప్రాంతంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు ఇప్పటికే పొరుగు దేశాల అధినేతలు, విదేశీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో పాటు సామాన్యులకు ఆహ్వానాలు అందాయి. ఇక ప్రమాణ స్వీకారం తర్వాత మోదీ వారణాసి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.