తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కళాకారుడు రుద్ర రాజేశం,మంత్రి జూపల్లి, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, తదితరులు హాజరయ్యారు. తెలంగాణ పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం రూపుదిద్దుకోనుంది.
పదేళ్ల రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఉత్సవాలు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్చనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ పాటను తెలంగాణ గీతంగా ప్రకటించారు. ఇదే వేదికపై రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. జూన్ 2న రాష్ట్ర గీతంతోపాటు రాష్ట్ర చిహ్నం, తెలంగా ణ తల్లి విగ్రహ నమూనాలను ఆవిష్కరించే అవకాశం ఉంది. తెలంగాణ తల్లి, రాష్ట్ర చిహ్నాన్ని మార్చాలని రాష్ట్ర కేబినెట్లో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవం ప్రతిబించించేలా తెలంగాణ తల్లి విగ్ర హాన్ని తీసుకువస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. పెత్తందార్లపై తిరుగుబాటు చేసిన చాకలి ఐలమ్మ, రజాకార్లపై తుపాకీ ఎక్కుపెట్టిన మల్లు స్వరాజ్యం వంటి వారి ఉద్యమస్ఫూర్తి కనిపించేలా విగ్రహం రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ చిహ్నంలోనూ ఉద్యమ స్ఫూర్తి, అమరవీరుల త్యాగాలు ప్రతిబింబించేలా మార్పులు చేస్తున్నట్లు సమాచారం.


