ప్రతిష్టాత్మక ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో పోరుకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ అభ్యర్ధిగా అధిష్టానం రామసహా యం రఘురామరెడ్డి ని ఖరారు చేసింది. ఉత్కంఠ కలిగించిన ఖమ్మం ఎంపీ కాంగ్రెస్ అభ్యర్ధి ఎంపిక వ్యవహారం నామినేషన్ల దాఖలు గడువుకు ఒక్కరోజు ముందు కొలిక్కివచ్చింది. పలువురు ఆశావాహులు టికెట్ కోసం పోటీ పడినా చివరకు రఘురామరెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపింది. తొలినుంచి కాంగ్రెస్ కుటుంబం కావడం రఘురామరెడ్డికి కలిసివచ్చింది. ఖమ్మంలో త్రిముఖ పోటీ తప్పదు. బీఆర్ ఎస్ నుంచి నామానాగేశ్వరరావు, బీజేపీ నుంచి తాండ్ర వినోద్ రావు ఇప్పటికే జోరుగా ప్రచారం సాగిస్తున్నారు.
రామసహాయం రఘురామరెడ్డి తండ్రి మాజీ ఎంపీ, రామసహాయం సురేందర్ రెడ్డి. రఘురామరెడ్డి ప్రస్తుతం రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి స్వయాన వియ్యంకుడు. ఖమ్మం కాంగ్రెస్ టికెట్ తన సోదరుడు ప్రసాదరెడ్డికి కాని వియ్యంకుడు రఘురామరెడ్డికి ఇవ్వాలని మొదటి నుంచీ పొంగులేటి పట్టుపడుతూ వచ్చారు. మరోవైపు ఖమ్మం టికెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్లు ప్రయత్నించారు. వీరితో పాటు గ్రానైట్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ నేత రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ కూడా టికెట్ ఆశించారు. ఓ దశలో మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే రఘురామరెడ్డి వైపే సీఎం మొదటినుంచి మొగ్గు చూపారని తెలుస్తోంది.
రఘురామరెడ్డిది మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబం కావడం, ఆర్ధికంగా స్ధితిమంతుడు కావడంతో ఆయన పేరును అధిష్టానం ఎంపిక చేసింది. రఘురామరెడ్డి ఇప్పటి వరకూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయలేదు. మొదటి సారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఆయన తండ్రి రామసహాయం సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. ఆయన వరంగల్ జిల్లా డోర్నకల్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, వరంగల్ ఎంపీగా నాలుగుసార్లు పనిచేశారు. రఘురామరెడ్డి వ్యాపారంలో రాణిస్తూనే తండ్రి స్పూర్తితో రాజకీయాల్లో రాణించాలని చాలా సార్లు టికెట్ కోసం ప్రయత్నించారు. వీరి కుటుంబానికి ఇందిరాగాంధి, రాజీవ్ గాంధీ, పీవీ నర్సింహారావు కటుంబాలతో సాన్నిహిత్యం ఉంది. రఘురామరెడ్డి గతంలో పలుసార్లు డోర్నకల్తో పాటు వరంగల్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్గా పనిచేశారు. ఉమ్మడి ఏపీలోని కిరణ్కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రాజ్యసభకు, ఎమ్మెల్సీ పదవికి ఆయన పేరు పరిశీలనలోకి వచ్చినా అవకాశం దక్కలేదు. గతంలో పాలకుర్తి, పాలేరు నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించినా టికెట్ దక్కలేదు.
రఘురామరెడ్డి 2011-13లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్యాట్రన్గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం హైదరాబాద్ పబ్లిక్స్కూల్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ వైస్ చైర్మన్గా, హైదరాబాద్ రేసు క్లబ్లో బోర్డు సభ్యడుగా వ్యవహరిస్తు న్నారు. మహబూబాబాద్ జిల్లా మర్రిపెడలో ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లకు వీరి కుటుంబం ఉచితంగా స్దలాలు ఇచ్చింది. ఈయనకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు సినీ నటుడు వెంకటేశ్ కుమార్తెను, చిన్న కుమారుడు మంత్రి పొంగులేటి కూతురిని వివాహం చేసుకున్నారు.రఘురామరెడ్డి ఎంపికతో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో సస్పెన్స్ కు తెరపడింది.


