రాజకీయ పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి అభిమన్యుడిని కాదు. అర్డునుడిని అంటూ విపక్షాలకు కౌంటర్ ఇస్తున్నారు జగన్. ఇదే తరహాలో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ విమర్శలను తిప్పికొడుతున్న సీఎం.. పులివెందుల వేదికగా రెచ్చిపోయారు. ఏ ఒక్కరినీ వదలలేదు. ఏ అంశాన్ని టచ్ చేయకుండా విడువలేదు. మీరా వైఎస్ఆర్ వారుసులు..? మీరు కాదా కుట్రదారులు అంటూ ఓవైపు చెల్లెళ్లపై విరుచు కుపడుతూనే.. మరోవైపు విపక్ష నేతలపై నిప్పులు చెరిగారు. ఘాటుగా సూటిగా ప్రశ్నల వర్షం కురిపిం చారు. ఇంతకీ జగన్ ఆరోపిస్తున్నట్టు వివేకాను చంపిన హంతకులెవరు..? వారితో చేతులు కలిపిన కుట్రదారులెవరు..?
ఏపీ ఎన్నికల కురుక్షేత్రంలో పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతోందన్న జగన్, రాజకీయ పద్మ వ్యూహంలో చిక్కుకొనని అర్జునుడిలా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఎత్తుకుపై ఎత్తులు వేస్తూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో వివేకా హత్యను అస్త్రంగా మార్చుకున్న ప్రతిపక్షాలకు, చెల్లెళ్లకు కౌంటర్ ఇచ్చారు జగన్. పులివెందుల వేదికగా టీడీపీ, జనసేన, బీజేపీలతోపాటు షర్మిల, సునీత టార్గెట్గా నిప్పుల వర్షం కురిపించారు. పులివెందుల వేదికగా వారిపై విరుచుకుపడ్డారు. రాజకీయ స్వార్థం కోసం వైఎస్ఆర్ పేరు లేకుండా చేయాలని కుట్ర చేసిన వారితోనే చేతులు కలిపారని చెళ్లెళ్లకు కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఘాటుగా సూటిగా ప్రశ్నలు సంధించారు. రాజకీయ స్వార్థం కోసం వైఎస్ఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు..? వైఎస్ఆర్ పేరు లేకుండా కుట్రలు చేసింది ఎవరు..? ఛార్జ్ షీట్ లో వైఎస్ పేరును చేర్చింది ఎవరు? అని జగన్ ప్రశ్నించారు. వైఎస్సార్ కీర్తి, ప్రతిష్టలను చెరిపివేయాలని ప్రయత్ని స్తున్న వారితో చేయి కలిపిన వాళ్లా వైఎస్సార్ వారసులు? అని షర్మిలపై మండిపడ్డారు. వైఎస్ఆర్ బతికుండగా ఎవరితో అయితే యుద్ధం చేశారో.. ఆ చంద్రబాబుకు వారసులా అని నిలదీశారు.
ఇక వివేకా హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్. చిన్నాన్న వివేకానందకు రెండో పెళ్లి అయింది వాస్తవం.. సంతానం ఉన్నది వాస్తవం అన్న ఆయన వివేకాను ఎవరు చంపారో! ఎవరు చంపించారో! జిల్లాలో అందరికీ తెలుసన్నారు. బురదజల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో..? వారి వెనుక ఎవరు ఉన్నారో కూడా తెలుసన్నారు. అలాగే వివేకాను చంపిన హంతకుడికి ఎవరు మద్దతు ఇస్తున్నారో అందరూ చూస్తున్నారని ధ్వజమెత్తారు . చిన్నాన్నను అన్యాయంగా ఎన్నికల్లో ఓడించిన వాళ్లతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని, ఇప్పుడు వారినే గెలిపించమనడం కంటే దిగజారుడు ఏముంటుందని షర్మిల, సునీతపై మండిపడ్డారు.
నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీలో చేరి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు జగన్. రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టి, ఏపీకి అన్యాయం చేసిన ఆ పార్టీకి ఓటు వేస్తే ఎవరికి లాభమో అందరూ ఆలోచించాలన్న సీఎం. వైసీపీ ఓట్లు చీలిస్తే చంద్రబాబుకు, విపక్ష కూటమికే లాభమన్నారు జగన్. మరోవైపు వైఎస్ అవినాష్ ఏ తప్పూ చేయలేదని బలంగా నమ్మాను కాబట్టే టికెట్ ఇచ్చానని చెప్పు కొచ్చారు జగన్. అవినాష్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని వాళ్లు అవినాష్ జీవితాన్ని నాశనం చేయడానికి జరుగుతున్న కుట్రలో భాగమవుతున్నారంటే వాళ్లసలు మనుషులేనా అని మండిపడ్డారు. మొత్తానికి పులివెందుల వేదికగా అటు షర్మిలకు, ఇటు విపక్ష నేతలకు కౌంటర్ ఇచ్చారు జగన్. అయితే ఆయన చేసిన ఈ సంచలన వ్యాఖ్యలే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. జగన్ ఆరోపిస్తున్న ఆ హంతకులెవరన్న చర్చ జోరుగా సాగుతోంది.