ఝార్కండ్ అంటే ఖనిజ సంపదకు పెట్టింది పేరు. అయితే ఇప్పటికీ ఝార్కండ్ రాష్ట్రం అభివృద్దికి నోచుకోలేదు. వెనుకబాటుతనానికి ప్రతీకాగానే నిలుస్తోంది. దీనికి అనేక కారణాలున్నాయి. ఇదిలా ఉంటే ఝార్కండ్లోని మూడు లోక్సభ నియోజకవర్గాలకు ఈనెల ఇరవైన పోలింగ్ జరగబోతోంది. ఒకసారి ఒకో కూటమికి మరోసారి మరో కూటమికి ఝార్కండ్ ప్రజలు పట్టం కడుతుంటారు. దీంతో ఈసారి ఝార్కండ్ ప్రజలు ఎవరికి జై కొడతారో అంతుబట్టడం లేదు.
ఝార్కండ్ ప్రజలు ఎప్పుడు ఎవరికి పట్టం కడతారో ఎవరూ చెప్పలేరు. గతంలో మాదిరిగానే ఇక్కడి ఫలితాలను ప్రస్తుతం కూడా అంచనా వేయడం కష్టం. ఈనెల ఇరవైన ఝార్కండ్లోని మూడు నియోజక వర్గాలకు ఐదో విడతలో భాగంగా అధికారులు ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఒకవైపు భారతీయ జనతా పార్టీ, ఆల్ ఝార్కండ్ స్టూడెంట్స్ యూనియన్ ఒక జట్టుగా బరిలో ఉన్నాయి. మరోవైపు ఝార్కండ్ ముక్తి మోర్చా, రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పోటీ చేస్తున్నాయి. పేదరికం, నిరుద్యోగం, మౌలిక వసతులు లేకపోవడం ఝార్కండ్లోని ప్రధాన సమస్యలు. చత్రా నియోజక వర్గం ఇది ఝార్కండ్ ఉత్తర ప్రాంతంలో ఉంటుంది. దళితులు, ఆదివాసీలు, అత్యంత వెనుకబడిన తరగతులవారు చత్రా నియోజకవర్గంలో భారీ సంఖ్యలో ఉంటారు. నియోజకవర్గంలోని ప్రజల్లో ఎక్కువ మంది గ్రామీణ పేదలే. చత్రా నియోజకవర్గంలో నక్సలైట్ల ప్రాబల్యం కూడా ఎక్కువ. చత్రా నియోజకవర్గం ఒకప్పుడు రాష్ట్రీయ జనతాదళ్కు పెట్టనికోట. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. జనాభా లెక్కల ప్రకారం చూస్తూ నియోజక వర్గంలో దళితులు 27 శాతం మంది ఉన్నారు. ఆదివాసీలు 21 శాతం మంది ఉన్నారు. కాగా ముస్లింలు 10 శాతం మంది ఉన్నారు.
చత్రా నియోజకవర్గంలో ఈసారి 22 మంది పోటీలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున కాళీ చరణ్ సింగ్, కాంగ్రెస్ టికెట్పై కృష్ణానంద్ త్రిపాఠీ బరిలో ఉన్నారు. 2014,2019లలో చత్రా నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ రికార్డు మెజారిటీతో విజయం సాధించింది. హజారీబాగ్ అపార బొగ్గు నిల్వలకు కేంద్రం ఈ నియోజకవర్గం. ఇక్కడి ఉత్తర కరణ్పుర, చార్హి, కుజు, ఘటోబాండ్, బర్కాగావ్ ప్రాంతాలు బొగ్గు నిల్వలకు దేశవ్యాప్తంగా ప్రసిద్ది. బొగ్గు గనులే హజారీబాగ్ ప్రజల జీవనాధారం. హజారీ బాగ్ ప్రాంతం కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాకు బాగా పట్టున్న ప్రాంతం. 2014,2019 ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ సిన్హా భారీ మెజారిటీలతో గెలిచారు. అయితే ఈసారి జయంత్ సిన్హాకు బీజేపీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. మనీశ్ జైశ్వాల్ అనే నాయకుడికి టికెట్ ఇచ్చి బరిలో నిలిపింది కమలం పార్టీ. ఇక హస్తం పార్టీ తరఫున జై ప్రకాశ్ భాయ్ పటేల్ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనీశ్ జైశ్వాల్కు జయంత్ సిన్హా ఎంతవరకు సహకరిస్తారన్నది ప్రశ్నగా మారింది.
జనాభా లెక్కలు తీస్తే నియోజకవర్గంలో ముస్లింలు 15 శాతం ఉంటే, దళితులు కూడా 15 శాతం ఉన్నారు. ఇక ఆది వాసీలు 12శాతం ఉన్నారు. హజారీబాగ్ కు సంబంధించి మరో విశేషం ఉంది. హజారీబాగ్ ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంటుంది. పర్యాటక ప్రాంతంగానూ హజారీబాగ్కు పేరుంది. మౌలికంగా వెనుకబడిన ప్రాంతమైనప్పటికీ హజారీబాగ్లో విద్యావంతులు ఎక్కువ. ఈ నియోజకవర్గంలో 70 శాతా నికి పైగా అక్షరాస్యత ఉంది. కోడర్మా ఈనెల 20న పోలింగ్ జరగనున్న మరో నియోజకవర్గం ఇది. కోడర్మా నియోజకవర్గంలో 17 లక్షల మంది ఓటర్లున్నారు. 1977లో కోడర్మా నియోజకవర్గం ఏర్పడింది. కోడర్మా సెగ్మెంట్ సంప్రదాయంగా బీజేపీకి అండగా ఉంటూ వస్తోంది. ఇప్పటివరకు ఏడు సార్లు కోడర్మా నియోజ కవర్గం నుంచి కమలం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఈసారి బీజేపీ టికెట్పై సిట్టింగ్ ఎంపీ అన్న పూర్ణాదేవి బరిలో ఉన్నారు. ఇండయా కూటమి తరఫున సీపీఐ మార్క్సిస్టు, లెనినిస్టు లిబరేషన్ అభ్యర్థి వినోద్ కుమార్ సింగ్ పోటీ చేస్తున్నారు. కోడర్మాలో ముస్లింలు 19 శాతం మంది ఉన్నారు. అలాగే 14 శాతం మంది దళితులు, ఎనిమిది శాతం మంది ఆదివాసీలు ఉన్నారు. బీజేపీపై నియోజకవర్గంలో అసంతృప్తి కనిపిస్తోంది. ఉద్యో గాల కల్పన, ధరల నియంత్రణ, అభివృద్దిపై ఇచ్చిన హామీలు నెరవేర లేదన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. సంప్ర దాయ ఓట్ బ్యాంక్పై బీజేపీ ఆధారపడుతోంది. కాగా హేమంత్ సోరేన్పై సానుభూతి, నిరుద్యోగం, ధరల పెరుగు దల వంటి అంశాలు తమను గెలుపు తీరాలకు చేరుస్తా యని ఇండియా కూటమి భావిస్తోంది. మొత్తానికి ఈసారి లోక్ సభ ఎన్నికలలో ఝార్కం డ్ లోని ఈ మూడు నియోజకవర్గాల ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారో ఎవరికీ అంతుపట్టడం లేదు.