ఏపీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కాసేపట్లో ప్రారంభ కానుంది. బస్సు యాత్ర ఇవాళ్టితో ముగియనుంది. టెక్కలిలో జరిగే బహిరంగ సభతో తొలి విడత యాత్ర ముగుస్తుంది. దీంతో టెక్కలి ముగింపు సభకు భారీ జనసమీకరణ చేస్తోంది వైసీపీ. యాత్రలో భాగంగా అక్కివలస నుంచి బయల్దేరబోతున్నారు సీఎం జగన్. అక్కడి నుంచి ఎచ్చెర్ల బైపాస్, శ్రీకాకుళం బైపాస్, నరసన్నపేట బైపాస్, కోటబొమ్మాళి, కన్నెవలస మీదుగా పరశురాంపురం జంక్షన్ వద్దకు చేరుకుంటారు. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కె.కొత్తూరు మీదుగా టెక్కలి వద్దకు చేరుకొని, అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగిస్తారు.
ఇక సభ ముగియగానే సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. సార్వత్రిక ఎన్నికల్లో తొలి విడత ప్రచారంలో భాగంగా సీఎం జగన్.. గతనెల 27న ఇడుపుల పాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి యాత్ర ప్రారంభించారు. అడుగడుగునా ప్రజలకు భరోసా ఇస్తూ యాత్ర కొనసాగించారు. ఇప్పటి వరకు 21 రోజుల పాటు 22 జిల్లాల్లో యాత్ర కొనసాగింది. 15 చోట్ల భారీ బహిరంగ సభల్లో ప్రసంగించారు సీఎం జగన్.


