ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. సోమవారం రాత్రి కేవలం కొద్దిసేపు మాత్రమే నిద్రపోయారని, ఆయన రక్తంలో చక్కెర స్థాయి తీవ్రంగా పడిపోయిందని జైలు అధికారులు తెలిపారు. కేజ్రీవాల్ అర్ధరాత్రి వరకూ సెల్లో అటు, ఇటు తిరుగుతూ కనిపించారని, కొద్దిసేపు ఆయన కటిక నేలపైనే పడుకున్నారని చెప్పారు. ఉదయం ఆయనకు టీ, రెండు బిస్కట్లు అందించి మరోమారు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. కేజ్రీవాల్కు చక్కెరస్థాయి 50కు చేరుకుంది.
వైద్యుల సూచనలతో ఆయనకు మందులు ఇస్తున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి వచ్చేవరకు ప్రతిరోజు మధ్యాహ్నం, రాత్రి భోజనంగా ఇంటి నుంచి వచ్చిన ఆహారాన్ని అనుమతించారు. సెల్ బయట జైలు అధికారితోపాటు ఇద్దరు భద్రతా సిబ్బందిని నియమించారు. అత్యవసనర సేవల సిబ్బందినీ సెల్ సమీపంలో సిద్ధంగా ఉంచారు. సీసీకెమెరాల ద్వారా ఆయన్ను ఎప్పటికప్పుడు జైలు అధికారులు గమనిస్తున్నారు. జైల్లో ఆయనకు ఓ పరుపు, దుప్పట్లు, రెండు దిండ్లు సమకూర్చినట్లు సమాచారం. కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన భార్య సునీతతో మాట్లాడారు. మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల మధ్య వీడియో కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేసినట్లు కారాగారం అధికారులు తెలిపారు. అదేవిధంగా మధ్యాహ్నం మూడు గంటలకు కేజ్రీవాల్ తన న్యాయవాదితో కొన్ని నిమిషాలపాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొన్ని పత్రాలపై సంతకాలు చేశారు.


