చిత్రం: సగిలేటి కథ
విడుదల తేదీ: 13-10-2023
నటీనటులు: రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్, నరసింహా ప్రసాద్ పంతగాని ,రాజశేఖర్ అనింగి, రమని, రమేష్, సుదర్శన్ తదితరులు
నిర్మాణ సంస్థ: షేడ్ ఎంటర్టైన్మెంట్, అశోక్ ఆర్ట్స్ బ్యానర్
నిర్మాతలు: దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి
సమర్పణ: నవదీప్
సంగీతం: జశ్వంత్ పసుపులేటి
నేపథ్య సంగీతం: సనల్ వాసుదేవ్
రచన, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్: రాజశేఖర్ సుడ్మూన్
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ‘బలగం’ సినిమా ఎంత మంచి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అదే కోవలో రాయలసీమ బ్యాక్డ్రాప్లో రూపొందిన చిత్రం ‘సగిలేటి కథ’. రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని కడప జిల్లాకు చెందిన రాజశేఖర్ సుద్మూన్ రూపొందించారు. సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్రావు రాసిన ‘సగిలేటి కథలు’ పుస్తకం నుంచి ప్రేరణ పొంది.. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో ముఖ్యంగా కడప జిల్లా బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రమోషన్స్ బాధ్యతను హీరో నవదీప్ తన భుజాలపైకెత్తుకుని సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశారు. ఈ సినిమా చూస్తే వెజిటేరియన్స్ కూడా నాన్ వెజిటేరియన్స్గా మారిపోతారని ప్రమోషన్స్లో చెప్పారు. అంతగా ఈ సినిమాలో ఏం ఉంది? నిజంగా ఇది రాయలసీమ ‘బలగం’ అవుతుందా?.. ఈ విషయాలు తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళ్లాలి..
కథ:
ఈ సినిమా కథ కడప జిల్లాలోని సగిలేరు అనే గ్రామంలో 2007లో మొదలవుతుంది. ఆ ఊళ్లో కొన్నేళ్లుగా వర్షాలు పడక అనావృష్టి తాండవం చేస్తూ ఉంటుంది. ప్రజలు వివిధ సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం కోసం గంగాలమ్మ జాతర చేయాలని ఊరి పెద్దలు రచ్చబండ దగ్గర తీర్మానం చేస్తారు. ఆ గ్రామ పెద్దలు చౌడప్ప(రాజ శేఖర్ అనింగి), ఆర్ఎంపీ డాక్టర్ దొరసామి(రమేశ్) మంచి స్నేహితులు. చౌడప్ప కొడుకు కుమార్ (రవి మహాదాస్యం) కువైట్ నుంచి అప్పుడే ఊరికి తిరిగొస్తాడు. తొలి చూపులోనే దొరసామి కూతురు కృష్ణవేణి(విషిక)తో ప్రేమలో పడతాడు. ఇద్దరు తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలని భావిస్తారు. ఊళ్లో గంగాలమ్మ జాతర ముగిసిన తర్వాత ఇంట్లో ప్రేమ విషయాన్ని చెప్పాలనుకుంటారు. ఓ కారణంగా చౌడప్ప తన స్నేహితుడు దొరసామిని నరికి చంపేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? కుమార్, కృష్ణవేణిల ప్రేమ కథ ఎలా ముగిసింది? ఊళ్లో గంగాలమ్మ జాతర జరిగిందా లేదా? తండ్రిని చంపిన చౌడప్పపై కృష్ణవేణి ఎలా పగ తీర్చుకుంది? చివరకు కుమార్, కృష్ణవేణి ఒక్కటయ్యారా? లేదా? మధ్యలో రోషం రాజు(నరసింహ ప్రసాద్ పంతగాని) చికెన్ కథేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
గ్రామీణ నేపథ్యంలో సాగే కథ కనుక రకరకాల పాత్రల చుట్టూ కథను నడపాలి. నగరాల్లో అయితే మనుషుల మధ్య సంబంధబాంధవ్యాలు సరిగ్గా ఉండవు. అయితే గ్రామాల్లో ఒకరికొకరు ఎంతో అన్యోనంగా ఉంటారు. ఇక కుటుంబ సభ్యులతో చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారు. ప్రమోషన్స్లో బలగం సినిమాతో పోల్చుకోవడంతో అలాంటి ఎమోషన్స్ ఇందులో ఉంటాయోమో అని ప్రేక్షకుడికి అనిపిస్తుంది. అయితే సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుడు ఎమోషనల్గా కనెక్ట్ అవడం తక్కువే. హీరో తండ్రి గంగాలమ్మ జాతరలో చేసిన పనికి హీరోయిన్ చివరకు ఎలా ప్రతీకారం తీర్చుకుందనే విషయాన్ని చెప్పే విధానం కన్విన్సింగ్గా ఉండదు. ఇక హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా జెన్యూన్గా అనిపించదు. ఎన్నో సినిమాల్లో చూపించిందే ఇందులో చూపించారు. అయితే గ్రామాల్లో మాటా మాటా పెరిగి ప్రాణాలు తీసే క్షణికావేశం వంటివి ఇందులో చక్కగా చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఊళ్లో మర్దర్ జరిగినా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం వంటివి లాజిక్కు అందవు. క్లైమాక్స్లో ట్విస్ట్ కొత్తగా ఉంది. లాజిక్కులు వెతక్కుండా చూస్తే అక్కడక్కడా నవ్వుకుని ఎంజాయ్ చేయొచ్చు.
సినిమాకు ప్రధాన బలం రోషం రాజు క్యారెక్టర్ అని చెప్పాలి. కోడికూర తినడం కోసం అతను పడే పాట్లు ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తాయి. ఇక కువైట్ నుంచి తిరిగొచ్చిన సర్పంచ్ భార్య పాత్ర కూడా ప్రేక్షకులకు కాస్తంత వినోదాన్ని పంచుతుంది. అలాగే వడ్డీకి డబ్బులిచ్చే పాత్ర కూడా అక్కడక్కడా హాస్యాన్ని పండిస్తుంది. మొత్తంగా సగిలేటి కథను రివేంజ్ డ్రామాగా తెరకెక్కించి.. కథనం కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ వారం చిన్న సినిమాలు భారీగా విడుదల అవుతుండడంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
నటీనటుల విశ్లేషణ:
కుమార్ పాత్రలో రవి చక్కగా నటించాడు. అవసరమైన చోట అమాయకత్వాన్ని అలాగే ఎమోషన్స్ను బాగా పలికించాడు. హీరోగా తనకు ఇది తొలి సినిమా అయినా.. యూట్యూబ్ వీడియోలు చేసిన అనుభవాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. తెరపై చూడడానికి పక్కింటి అబ్బాయిలా అనిపిస్తాడు. టామ్ బాయ్ క్యారెక్టర్లో కృష్ణ కుమారిగా విషిక అద్భుతంగా నటించింది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. ప్రెసిడెంట్ చౌడప్ప పాత్రకు ‘శుభోదయం సుబ్బారావు’ అలియాస్ రాజశేఖర్ జీవం పోశారు. ఈ సినిమా తర్వాత ఆయనకు మరిన్ని మంచి అవకాశాలు వస్తాయి. హీరో తల్లి పాత్ర కూడా బాగుంది. రోషం రాజు పాత్రలో పంతగాని నరసింహ ప్రసాద్ నవ్వించే ప్రయత్నం చేశారు. హీరోయిన్ తమ్ముడి పాత్రలో నటించిన సుదర్శన్, వడ్డీకి డబ్బులు ఇచ్చే హీరో ఫ్రెండ్ పాత్రలో సాయి మోహన్ కూడా పర్వాలేదనిపించారు. ఇక ఇతర క్యారెక్టర్లు తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేశారు.
సాంకేతిక విశ్లేషణ:
దర్శకుడు రాజశేఖర్ సూద్మూన్ ఈ సినిమాకు కథతో పాటు సినిమాటోగ్రఫర్గా, ఎడిటర్గా, దర్శకుడిగా వివిధ విభాగాలను చాలా బాగా హ్యాండిల్ చేశాడు. దాసరి నారాయణ రావు, ఆర్. నారాయణ మూర్తి తర్వాత ఇన్ని విభాగాలను డీల్ చేసిన దర్శకుడిగా రాజశేఖర్ సూద్మూన్ నిలిచారు. కొత్తవాళ్లతో ఈ సినిమా తీయడం సాహసమనే చెప్పాలి. ముఖ్యంగా కొత్త నటీనటులతో ఆ తరహా విలేజ్ బ్యాక్ డ్రాప్ రన్ చేయడం అంత సులభం కాదు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని మనుషుల ప్రవర్తన, వారి హావభావాలను నేచురల్గా తన కెమెరాలో బంధించాడు. ముఖ్యంగా నరసింహా ప్రసాద్ అనే నటుడితో చేయించిన చికెన్ కామెడీ ప్రేక్షకులను అలరిస్తుంది. సాంకేతికంగా చూస్తే ఈ సినిమా మంచి క్వాలిటీతో తెరకెక్కింది. దర్శకుడే ఛాయాగ్రాహకుడు అవడంతో విజువల్స్ మీద మంచి గ్రిప్తో తనకి కావాల్సిన నేచురాలిటీని రాబట్టుకున్నారు. జస్వంత్ అందించిన సంగీతం కూడా కథకు తగ్గట్టు చక్కగా కుదిరింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. గ్రామీణ నేపథ్యంలో సహజంగా చిత్రాన్ని రూపొందించి నిర్మాతలు మంచి ప్రయత్నం చేశారు.
చివరిగా.. రాయలసీమ నేటివిటీని ఇష్టపడేవారికి నచ్చే సినిమా
రేటింగ్: 2.5/5