విడుదల తేదీ: 06/10/2023
నటీ నటులు: భరత్, విషికా లక్ష్మణ్, కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
బ్యానర్ : ప్రభాత్ క్రియేషన్స్
నిర్మాత : ప్రదీప్ కుమార్. ఎం
డైరెక్టర్ : గంగాధర. టి
కెమెరామెన్ : సతీష్ మాసం
సంగీతం : పీఆర్ (పెద్దపల్లి రోహిత్)
మాటలు : వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల
ఎడిటర్ : జేపీ
ఓ మంచి గ్రామీణ నేపథ్యంలో, స్వచ్చమైన ప్రేమ కథను చూసి చాలా కాలమే అవుతోంది. అలాంటి మంచి వింటేజ్ విలేజ్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే ‘ఏందిరా ఈ పంచాయితీ’. భరత్, విషికా లక్ష్మణ్ జంటగా ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మించిన చిత్రం ద్వారా గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పాటలు, గ్లింప్స్, టీజర్ ఇలా అన్నీ కూడా సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకున్నాయి. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
కథ:
రామాపురం అనే గ్రామంలో వరుస దొంగతనాలు జరుగుతుండడంతో ఆ ఊరి ప్రజలు హడలిపోతుంటారు. దాంతో ఆ ఊరి సర్పంచ్ పెద్దారెడ్డి (తోటపల్లి మధు)తో పాటు ఊరి పెద్దలైన సుధాకర్ రెడ్డి (రవి వర్మ ), రామచంద్రారావు( కాశీ విశ్వనాధ్)లు గ్రామ ప్రజల ఎదుట పంచాయితీ పెడతారు. ఈ ఊరిలో జరిగే దొంగతనాలు అరికట్టాలంటే మన ఊరికి ఒక పోలీసు ఉండాలి. కాబట్టి ఎస్సై కావాలని ప్రయత్నం చేస్తున్న అభి(భరత్)ని ఊరికి కాపలా పెడితే కరెక్ట్ అని అందుకు ఊరి ఫండ్ నుండి జీతం కూడా ఇస్తామని చెప్పడంతో అభి ఒప్పుకుంటాడు. ఈ క్రమంలో ఊరి పెద్ద రామాంచంద్ర రావు ఇంట్లో జరిగిన దొంగతనం గురించి ఎంక్వ్వైరీకి వెళ్లిన అభి.. సిటీ నుండి వచ్చిన రామాచంద్రారావు కూతురు యమున (విషికా లక్ష్మణ్ )ను చూసిన మొదటి చూపులో ప్రేమలో పడతాడు. ఆ తరువాత అభి చేసిన ఒక మంచి పనితో ఆమె అతడిని ఇష్టపడుతుంది. దాంతో వారిద్దరూ పెళ్లిచేసుకోవాలనుకుంటారు.
మరోవైపు పుంగనూరు ఎమ్మెల్యే నందకిశోర్ రామాపురం పెద్దలను పిలిపించి రాబోయే ఎలక్షన్లో మీ ఊరి ప్రజలు ఓటు వేసి మళ్ళీ నన్నే గెలిపించాలని కోరుతూ మీ ఊరిని బాగు చేసుకోమని మూడుకోట్లు ఇస్తాడు. అవి తీసుకొని ఊరికి వచ్చిన తరువాత ఆ మూడు కోట్లు మిస్ అవుతాయి..ఆ నేరం అభిపై పడుతుంది. పోలీసులు అభిని అరెస్ట్ చేస్తారు. దీంతో యమున అభిని దూరం పెడుతుంది. అలాగే తన తండ్రి తెచ్చిన సంబంధం ఒప్పుకొని పెళ్ళికి సిద్దపడుతుంది. పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చిన అభి.. యమునకు నిక్షితార్థం జరుగుతుందని తెలుసుకుంటాడు. దాంతో యమున ఇంటికి వచ్చి ఆమె తండ్రితో గొడవపడతాడు. ఈ గొడవలో యమున తండ్రి గాయపడతాడు. అది చూసిన యమున అభిని అసహ్యించుకొని పోలీసులకు పట్టిస్తుంది.అయితే అనూహ్యంగా ఊరి సర్పంచ్ పెద్దారెడ్డి, సుధాకర్ రెడ్డి హత్యకు గురవుతారు. ఈ నేరం కూడా అభిపై పడుతుంది. ఇంతకూ ఈ జంట హత్యలు ఎవరు చేశారు? ఈ నేరానికి, అభికు ఉన్న సంబంధం ఏంటి? ఈ దొంగతనం, మర్డర్ కేస్ల నుండి అభి ఎలా బయట పడ్డాడు? తను ప్రేమించిన యమునను దక్కించుకున్నాడా లేదా? ఊరికి సంబందించిన మూడు కోట్లు రికవరీ చేశాడా లేదా ? చివరకు ఎస్సై కావాలనే డ్రీమ్ను అభి నెరవేర్చుకున్నాడా ? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
నటీనటుల విశ్లేషణ:
ఎస్సై కావాలని కలలుకనే పాత్రలో అభి(భరత్ )తన హావభావాలతో పాటు, మాటలు, పాటలు, ఫైట్స్, ఏమోషన్స్ ఇలా అన్ని షేడ్స్లో చాలా చక్కగా నటించి నటుడుగా ప్రూవ్ చేసుకున్నాడు. నటుడుగా తనకిది మొదటి సినిమా అయినా అనుభవం ఉన్నవాడిలా కథను తన భుజాలపై వేసుకొని చాలా చక్కగా నటించాడు. యమున పాత్రలో హీరోయిన్గా నటించిన విషికా లక్ష్మణ్ తనకిచ్చిన పాత్రలో ఒదిగి పోయింది. తన నటనతో అద్భుతమైన పెర్ఫార్మన్స్ చేసి మరో మెట్టు పైకి తీసుకెళ్లిందని చెప్పవచ్చు. తెరపై వీరిద్దరి జోడీ చాలా క్యూట్గా ఉంది. హీరోకు ఫ్రెండ్స్గా నటించిన సత్తి (తేజ ), శ్రీను పాత్రలో దర్శకుడు గంగాధర్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేసి కామెడీ ట్రాక్తో మెప్పించారనే చెప్పాలి. ఊరి జనాలకు ఏ కష్టం వచ్చినా ముందుండే ఊరి పెద్దలుగా పెద్దారెడ్డి (తోటపల్లి మధు), సుధాకర్ రెడ్డి(రవి వర్మ ), రామచంద్ర ( కాశీ విశ్వనాధ్ ) చాలా చక్కగా నటించారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ పాత్రలో నటించిన ఎస్సై ప్రదీప్ (విజయ్ ) నటన న్యాచురల్గా ఉంది. అభికి తండ్రిగా ప్రేమ్ సాగర్, బ్యాంక్ మేనేజర్గా సమీర్లు, యమున ఫ్రెండ్గా స్వాతి (లత ) చక్కటి పెర్ఫార్మన్స్ చేశారు. ఇంకా ఇందులో నటించిన వారంతా తమ పరిధి మేరకు నటించి మెప్పించారని చెప్పవచ్చు.
సాంకేతిక విశ్లేషణ:
డైరెక్టర్ గంగాధర్కు ఇది తొలి సినిమా అయినప్పటికీ సిటీలో ఉండే పబ్ కల్చర్, పల్లెటూర్లో ఉండే స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందనే కథను సెలెక్ట్ చేసుకుని ఎమోషనల్గా బాండింగ్ ఉన్న సబ్జెక్ను ఫీల్గుడ్ లవ్స్టోరీ లాంటి ఆసక్తికర సన్నివేశాలతో ఆద్యంతం ప్రేక్షకులు సస్పెన్స్కు గురయ్యేలా కొనసాగిస్తూ చక్కటి కథ, స్క్రీన్ ప్లేతో తీసిన తీరు ప్రేక్షకులకు ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ఎటువంటి డబుల్ మీనింగ్ జోకులు గాని లేకుండా సహజంగా ఆకట్టుకునే సన్నివేశాలతో నీట్ అండ్ క్లీన్గా సినిమాని తెలుగు ప్రేక్షకులు అందించడంలో దర్శకుడు గంగాధర్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. పీఆర్ (పెద్దపల్లి రోహిత్) అద్భుతమైన సంగీతం అందించారు. సునీత పాడిన తండ్రి కూతుళ్లు మధ్య వచ్చే ఎమోషనల్ సాంగ్, నాన్న పాట, అనురాగ్ కులకర్ణి పాడిన లవ్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సతీష్ మాసం కెమెరా పనితనం మెచ్చుకోవచ్చు. సస్పెన్స్తో సాగే ప్రతి సన్నివేశాన్ని తన కెమెరాలో చక్కగా బంధించి తన కెమెరా పనితనాన్ని చాటారు. జేపీ ఎడిటింగ్ పనితీరు బాగుంది. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్పై ప్రదీప్ కుమార్.ఎం ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఎమోషనల్ లవ్ స్టోరీతో పాటు, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న ‘ఏందిరా ఈ పంచాయితీ’ సినిమా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని చెప్పవచ్చు .
రేటింగ్: 2.25/5