స్వతంత్ర వెబ్ డెస్క్: మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఢిల్లీలో వరదలు పోటెత్తాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ఉప్పొంగి ప్రవహిస్తున్నది. యమునా నదిలో 206 మీటర్ల ప్రవాహ మట్టమే ప్రమాదకరం కాగా, ప్రస్తుతం ఆ నది 207.55 మీటర్ల స్థాయిలో పరుగులు తీస్తున్నది. గత 45 ఏళ్లలో యమునా నది ఇంత ఉధృతంగా ప్రవహించడం ఇదే తొలిసారి. దీంతో అనేక కాలనీల్లో వరద నీరు చేరింది. కేంద్ర జల కమిషన్ సమాచారం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ఢిల్లీలోని పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది నీటి మట్టం 207.55 మీటర్లకు పెరిగింది.
హరియాణా నుంచి నీటిని విడుదల చేయడంతో ఢిల్లీలో యుమనా నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఈ నది ప్రమాదకర స్థాయి 205.33 మీటర్ల కాగా.. ఆ మార్క్ను రెండు రోజుల క్రితమే దాటింది. 2013 తర్వాత మళ్లీ బుధవారం ఉదయమే 207 మార్క్ను తాకిన నది నీటిమట్టం.. ఈ మధ్యాహ్నానికి ఏకంగా 207.55 మీటర్లుగా నమోదైంది. ఈ స్థాయిలో నది నీటిమట్టం పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఢిల్లీలో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తూ ప్రమాద ఘంటికలు మోగిస్తుండటంతో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కేంద్రం జోక్యాన్ని కోరారు. యమునా నది నీటి మట్టం స్థాయిలు మున్ముందు పెరగకుండా చూడాలని ట్విటర్లో విజ్ఞప్తి చేశారు. కేంద్ర జలసంఘం అంచనా వేస్తున్నట్టు 207.72 మీటర్లకు నీటి మట్టం స్థాయి పెరిగితే.. ఢిల్లీకి మంచిదికాదన్నారు. గత రెండు రోజులుగా ఢిల్లీలో వర్షాలు పడకపోయినప్పటికీ యమునా నది జలాలు అసాధారణ స్థాయిలో పెరుగుతున్నాయన్న కేజ్రీవాల్.. హరియాణాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేయడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. అందువల్ల, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని యమునా నీటి స్థాయిలు పెరగకుండా జోక్యం చేసుకోవాలని కోరారు. వరద పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నతాధికారులతో అత్యవసంగా సమావేశమయ్యారు. వరద ముప్పును ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు, వరదలు సంభవించే అవకాశమున్న ప్రాంతాల్లో ఢిల్లీలో పోలీసులు ముందు జాగ్రత్తగా 144 సెక్షన్ విధించారు.