స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణాలో ఈ ఏడాది చివర్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నికల సంఘం ఫుల్ ఫోకస్ పెట్టింది. షెడ్యూల్ ప్రకారమే ఈ ఏడాది చివరలో ఎన్నికలు పూర్తి చేస్తామని.. దానికి తగిన ఏర్పాట్లు ఇప్పటినుంచే ప్రారంభిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు ఈ రోజు నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం చేసే చర్యలు తీసుకోనున్నారు. నేడు తెలంగాణ ఎన్నికల కమిషనర్తో భేటీ అయ్యారు. రేపు కలెక్టర్లు, ఎస్పీలతో, ఎల్లుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమీక్ష నిర్వహించనున్నారు.
అయితే తెలంగాణలో 2023 లోనే ఎన్నికలు జరిగేలా ఈసీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది.. ఈ సంవత్సరం నవంబర్ లో షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం కూడా ఉంది.ఇంతకుముందు తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగేవి. కానీ, 2018లో సీఎం కేసీఆర్ ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. ఐదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది చివర్లోనే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ సన్నద్దమవుతోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై వరుసగా అధికారులకు ట్రైనింగ్ ను కూడా ఇస్తూ వస్తోంది. ముందుగా ఓటర్ల నమోదు చేయడం తరువాత పోలింగ్ ఆ తరువాత ఓట్ల లెక్కింపు వరకు ఎన్నికల ప్రాసెస్ పై శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా రాష్ట్రం లో మూడు సంవత్సరాలు ఒకే ప్రాంతం లో పనిచేస్తున్న అధికారుల బదిలీ ల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలను ఇచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తం గా బదిలీల ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది. వచ్చే నెల 31 వ తేదీ లోపు ఈ బదిలీల ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయనున్నట్లు తెలుస్తుంది.