స్వతంత్ర వెబ్ డెస్క్: ఇటీవల ఒడిశాలో చోటుచేసుకున్న ఘోర రైలు దుర్ఘటనలో బాధిత కుటుంబాలకు రూ.10కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు సుకేశ్ చంద్రశేఖర్ ముందుకొచ్చాడు. ఆ విరాళాన్ని అంగీకరించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు అతడు లేఖ రాశాడు. రూ.200కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన సుకేశ్ చంద్రశేఖర్ ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉన్నాడు. అక్కడి నుంచే ఆ లేఖను రైల్వేశాఖకు పంపాడు.అయితే ఈ విషయంపై ప్రభత్వం, ప్రజలు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
తాను వ్యక్తిగతంగా, చట్టబద్ధంగా సంపాదించిన మొత్తాన్ని ఇస్తానని పేర్కొన్నాడు. రైలు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువు కోసం ఆ మొత్తాన్ని వినియోగించాలని విజ్ఞప్తి చేశాడు. “మన ప్రభుత్వం ఇప్పటికే బాధిత ప్రజలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందజేస్తోంది. ఒక బాధ్యతాయుతమైన, మంచి పౌరుడిగా.. రూ. 10 కోట్లను ఆ కుటుంబాలు/పిల్లలు, భావి యువత కోసం ప్రత్యేకంగా వినియోగించే నిధిగా అందిస్తున్నాను. తమ ప్రియమైన వ్యక్తిని/కుటుంబాన్ని పోషించే వారిని కోల్పోయిన వారి చదువుల ఖర్చుల కోసం కేటాయించాలని కోరుతున్నా” అని లేఖలో రాసుకొచ్చాడు.