ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు సంజయ్ సింగ్ పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ అనుమతించలేదు. ప్రస్తుతం ఆయన వ్యవహారం సభాహక్కుల కమిటీ పరిశీలనలో ఉందన్న సాకుతో ధన్కడ్ సంజయ్ సింగ్ ను ప్రమాణం చేయడానికి అనుమతించలేదు. మనీలాండరింగ్ కేసులో సంజయ్ సింగ్ గతంలో అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ ఎక్సైజ్ విధానానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఆయన పై ఆరోపణలు ఉన్నాయి. జనవరిలో ఢిల్లీ నుంచి సంజయ్ సింగ్ మరోసారి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఫిబ్రవరి 5 న పార్లమెం టుకు వెళ్లి రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సంజయ్ సింగ్ కు గతవారం ఢిల్లీ కోర్టు అనుమతి మంజూరు చేసింది. పోలీసు కస్టడీలో సంజయ్ సింగ్ ను ఉదయం 10 గంటలకల్లా పార్లమెంటు కు తీసుకెళ్లి ఆయన ప్రమాణ స్వీకారం చేసేందుకు వీలు కల్పించాలని స్పెషల్ జడ్జి ఎంకె నాగపాల్ ఆదేశాలు జారీ చేసారు. సంజయ్ సింగ్ ను ఎన్ ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ నిరుడు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.