అభయహస్తం పేరుతో ఆరు గ్యారెంటీలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ… ఆయా హామీల అమలు కోసం అడుగులు వేయడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ప్రజాపాలన పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. తాము అధికారంలోకి వచ్చేందుకు కీలకంగా ఉపయోగపడిన ఆరు గ్యారెంటీలతోపాటు రేషన్ కార్డులకు సైతం దరఖాస్తులు పెట్టుకోవచ్చని ప్రకటించింది ప్రభుత్వం. దీంతో… వెల్లువలా వచ్చాయి అర్జీలు.
గతేడాది డిసెంబర్ 28 నుంచి ప్రారంభమైన ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమం ఈనెల ఆరున ముగిసింది. ఈ కార్యక్రమం కింద మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం అర్హులైన వారు ముందుగా దరఖాస్తు నింపి ప్రజాపాలన సదస్సు కౌంటర్లో సమర్పించి రశీదు పొందే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇక్కడ స్వీకరించిన ప్రతీ దరఖాస్తుకు ఒక నెంబర్ ఇచ్చారు . హామీల అమలులో భాగంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టా త్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం మొదటి రోజే.. రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షలా 46 వేల 414 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో గ్రామీణ ప్రాంతాల నుంచి 2 లక్షలా 88 వేల 711 దరఖాస్తులు, జీహెచ్ఎంసీ కలుపుకొని పట్టణ ప్రాంతాల నుంచి 4 లక్షలా 57 వేల 703 దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. ఇక, రెండో రోజు మొత్తం 8 లక్షలా12 వేల 862 దరఖాస్తులు వచ్చాయి. అయితే.. చాలా ప్రాంతాల్లో ప్రజలకు దరఖాస్తులు లభించకపోవడంతో జిరాక్స్ షాపులను ఆశ్రయించారు. దీంతో.. సంబంధిత వ్యాపారులు, దరఖాస్తులు అందించడంలో విఫలమైన అధికారులపైనా ప్రభుత్వం ఆగ్రహించింది. అదే సమయంలో రైతు భరోసా, ఫించన్లపై అపోహలు వద్దని, కొత్త వాళ్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.
మొత్తంగా ఏడు రోజులకు కోటి ఎనిమిది లక్షలా 94 వేల 115 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ప్రధానంగా అభయ హస్తం ఆరు గ్యారెంటీలకు సంబంధించినవి 93 లక్షలా 38 వేల111 కాగా.. ఇతర అంశాలకు సంబంధించినవి 15 లక్షల 55 వేల 704 ఉన్నాయి. చివరి రోజు మరో పదిహేను లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నారు అధికారులు. ప్రజా పాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డాటా ఎంట్రీ ఈ నెల 17వ తేదీ వరకు పూర్తి చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటిం చిన నేపథ్యంలో.. ఇప్పుడు దరఖాస్తు చేయలేకపోయిన వాళ్లు నాలుగు నెలల తర్వాత తిరిగి తమ అర్జీలు సమర్పిం చవచ్చని తెలిపారు అధికారులు.
తొలిదశ ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 12 వేల 769 గ్రామ పంచాయతీలు, 3 వేల 626 మున్సి పల్ వార్డులతో కలిపి మొత్తం 16 వేల 395 ప్రదేశాలలో ప్రజాపాలన సదస్సులు నిర్వహించారు. ఇందుకోసం 3 వేల 714 మంది అధికారులు, సిబ్బందిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం మొత్తం సాఫీగా సాగేందుకు వీలుగా నోడల్ అధికారులను సైతం నియమించింది ప్రభుత్వం. దీంతో.. ఎక్కడికక్కడ దరఖాస్తులు వెల్లువెత్తాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.