ప్రజాస్వామ్యంలో ఎన్నికలే కీలకం. ఓటర్ల తీర్పు వెల్లడి కావడానికి ఎన్నికలే సరైన వేదికలు. ఎన్నికల్లో గెలిచిన పార్టీలే కేంద్రం, రాష్ట్రాల్లో అధికారానికి వస్తాయి. చట్టాలను చేస్తాయి. ప్రస్తుతం జరగుతున్న లోక్సభ ఎన్నికలు కీలకంగా మారాయి. భారత్ భవిష్యత్ను ఈ ఎన్నికలు నిర్దేశించబో తున్నాయి. ప్రపంచంలోనే భారత్ అత్యధిక జనాభా గల దేశంగా అందరికీ తెలిసిందే. అంతేకాదు అత్యధిక యువ జనాభా కలిగిన దేశం కూడా భారతదేశమే.
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో నాలుగు కోట్ల పది లక్షల మంది యువ ఓటర్లు కొత్తగా రాబోతున్నారు. అంటే 18 నుంచి 25 సంవత్సరాల వయసు గల యువ ఓటర్లు అన్నమాట. ఈ యువ ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. యువ ఓటర్లలో తొంభై శాతం మంది విద్యావంతులు. అనేక రాజకీయ, సామాజిక అంశాలపై అవగాహన ఉన్నవారు. అంతేకాదు, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటారు ఈ యువ ఓటర్లు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు అందిన లెక్కల ప్రకారం మొత్తం 96.9 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 21.5 కోట్ల మంది వ్యక్తులు కేవలం 29 ఏళ్లలోపు వారు మాత్రమే ఉన్నారు. భారతదేశ ఎన్నికల్లో యంగ్ ఓటర్లే పునాదిగా నిలవనున్నారు.
వాస్తవానికి 1980 వరకు వయోజనుల ఓటు హక్కు 21 ఏండ్లు ఉండేది. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఓటు హక్కును 18 సంవత్సరాలకు కుదించారు. అప్పటినుంచి 18 ఏండ్లకే ఓటుహక్కు కల్పించారు. ‘ప్రతి ఓటు విలువైనదే. ఎన్నికల ప్రాముఖ్యత నాకు తెలుసు. తాము ఓటు వేసినప్పుడు.. తమ ప్రాంతం అభివృద్ధే నాకు ప్రాతిపదిక అంటు న్నారు పలువురు యువజనులు. తాము ఏ పార్టీ నుంచి ప్రేరణ పొందడం లేదని యువజనులు అంటున్నారు. అన్ని పార్టీలకు ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు ఉన్నాయంటున్నారు.మంచి ఉద్యోగం, రాజకీయ స్థిరత్వం, సమాజంలో శాంతియుత వాతావరణం తాము కోరుకుంటున్నామన్నారు యువ ఓటర్లు.యువ ఓటర్లను ప్రధానంగా వేధిస్తున్న సమస్య. నిరుద్యోగం. చదువులు పూర్తయ్యాక తమ విద్యార్హతలకు తగిన ఉద్యోగాలు దొరుకుతాయా.లేవా అనే అనుమానం ఈ యువ ఓటర్లలో ఎక్కువగా ఉంటుంది. ప్రపంచబ్యాంక్ నివేదిక ప్రకారం 2022లో భారత్లోని యువతలో నిరుద్యోగం 23.22 శాతంగా ఉంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్లో కంటే అది ఎక్కువ. 2022-23లో దేశంలోని యువతలో నిరుద్యోగ రేటు 45.4 శాతంగా ఉన్నదని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంస్థ అంచనా వేసింది.
గతంలో తెలంగాణలో యువజనులు రాత్రింబవళ్లు చదివి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసినా, చివరకు అవి ఫలితాలనివ్వలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైఫల్యాల వల్ల చదువుకున్న యువతకు ఉద్యోగాలు దొరకలేదు. దీంతో తమ ఉపాధికి ఏ రాజకీయ పార్టీ హామీ ఇస్తుందా అని యువ ఓటర్లు ఆశగా ఎదురు చూస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో యువ ఓటర్లే కీలకం కానున్నారు. అభ్యర్థుల గెలుపోటములను యువ ఓటర్లే నిర్ణయించనున్నారు. యువజనులు ఎవరివైపు మొగ్గితే ఆ నాయకులే గెలుపుతీరాలకు చేరనున్నారు. కొంతమంది రాజకీయ నాయకుల తలరాతను తిరగ రాసే సత్తా కూడా యువ ఓటర్లకే ఉంటుంది. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు వజ్రాయుధం లాంటిది. దేశాభివృద్ధి కోసం నిస్వార్థంగా పనిచేసేవారిని ఎన్నుకోవడానికి ఓటు ఒక చక్కటి మార్గంగా పనిచే స్తుంది. ఓటు హక్కును పొందడానికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ అర్హులే. అర్హులైన వారు ఓటు హక్కు పొందడానికి ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో గ్రామస్థాయి నుంచి ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు చేపట్టాయి. ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవడానికి యువ ఓటర్లు చొరవ చూపాలి. పేరు నమోదు చేసుకోవడమే కాదు. పోలింగ్ రోజున తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది.


