అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం భైరవాని తిప్ప రిజర్వాయర్కు నీళ్లు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత మూడేళ్లుగా ప్రాజెక్టులో నీరు లేక బీటలుగా మారింది. మూడు రోజులుగా కర్ణాటక సరిహద్దుల్లో భారీగా వర్షాలు కురవడంతో పరివాహక ప్రాంతం నుంచి రిజర్వాయర్కు నీరు సరఫరా అవుతోంది. మరోవైపు నియోజకవర్గం లోని గుమ్మగుట్ట మండల సమీపంలో 1958లో వేదవతి నదిపై బీటీ ప్రాజెక్టు నిర్మించారు. దీంతో పలు గ్రామాల్లో 8వేల ఎకరాలు, కళ్యాణదుర్గం, బ్రహ్మ సముద్రం మండలంలోని 4వేల ఎకరాలకు సాగు నీరు అందేది. కర్ణాటక సరిహద్దుల్లోని అక్కడి ప్రభుత్వం చెక్ డ్యామ్లు, కుంటలు నిర్మించడంతో నీటి సరఫరా తగ్గింది. ఉపాధి లేక ప్రజలు వలసల బాట పడుతున్నారు. రెండు దశాబ్ధాలుగా ప్రభుత్వాలు మారినా హంద్రీనీవా, జీడీపల్లి రిజర్వాయర్ నుంచి భైరవానితిప్ప ప్రాజెక్టు సాగునీరు అందించే దిశలో విఫలం అయ్యాయి. దీనిపై రైతులు ఆందోళన చెందుతున్నారు.